అవినీతి తిండి తిందాం రండి!

Corruption Danda Basara IIIT Campus - Sakshi

బాసర ఐఐఐటీలో అక్రమార్కుల దందా

కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లలో కమీషన్ల దందా

తాజాగా క్యాంటీన్ల కాంట్రాక్టులోనూ అక్రమాలు

ఒక్కో విద్యార్థి రోజు భోజన ఖర్చుపై రూ. 26 అదనంగా పెంపు

సాక్షి, హైదరాబాద్‌ : బాసరలో అక్రమార్కుల బాస... జ్ఞాన సరస్వతి చెంత.. అవినీతి చింత.. టెండర్లు పెంచుకున్నారు. కమీషన్లు పంచుకున్నారు. నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యా లయంలో(ఆర్‌జీయూకేటీ– ట్రిపుల్‌ ఐటీ) అక్రమాల దందా కొనసాగుతోంది. విద్యార్థులకు భోజనం, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

అక్రమాలు అన్నీ ఇన్నీ కావు..

  • బాసర ట్రిపుల్‌ ఐటీలో మూడేళ్ల కిందట రోజుకు ఒక్కో విద్యార్థికి పెట్టే భోజనం ఖర్చు రూ.78. అప్పట్లో 6 వేలకుపైగా విద్యార్థులు ఉండేవారు. ట్రిపుల్‌ఐటీ అధికారులు దానిని కిందటేడాది రూ.69కి తగ్గించి టెండర్లు ఖరారు చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం(2019–20)లో విద్యార్థుల సంఖ్య 7,500కు చేరుకుంది. భోజ నం నిమిత్తం ఒక్కో విద్యార్థికి కనీసంగా రూ. 95 నుంచి రూ.105 చెల్లించేలా ట్రిపుల్‌ ఐటీ కమిటీ నిర్ణయం తీసుకొని టెండర్లు పిలిచింది. రూ.95 చొప్పున ఖరారు చేసింది. అంటే ఒక్కో విద్యార్థిపై రోజుకు చెల్లించే మొత్తాన్ని పాత రేటు కంటే రూ. 26 అదనంగా పెంచింది. 7,500 మంది విద్యార్థులకు 220 రోజులపాటు పెట్టే భోజనానికి నిర్వహించే క్యాంటీన్‌ టెండర్లను రూ.15.67 కోట్లకు ఖరారు చేసింది. గతంలో కంటే ఇప్పుడు రూ. 4.29 కోట్లు అదనంగా పెంచేసింది.
  • మార్కెట్‌లో కాన్ఫిగ రేషన్‌ను బట్టి రూ.39 వేల నుంచి రూ. 43 వేలకు లభించే ల్యాప్‌టాప్‌లను యాన్యువల్‌ మెయింటెనెన్స్‌ కలుపుకొని రూ. 51,600 చొప్పున కొనుగోలు చేసి భారీగా కమీ షన్లు పంచు కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. రూ.41 వేలకు ఒక ల్యాప్‌టాప్‌ చొప్పున లెక్కించినా 1,500 ల్యాప్‌టాప్‌లకు రూ. 6.15 కోట్లు అవుతాయి. కానీ వాటినే రూ. 7.74 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏడాది, రెండేళ్ల కిందట కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్‌లను బైబ్యాక్‌ పేరుతో ఒక్కో దానిని రూ. 6 వేలకే, అదికూడా ల్యాప్‌టాప్‌లు సరఫరా చేసిన వ్యక్తులకే అమ్మేస్తున్నారు. ఈ వ్యవహారంలో రూ.కోట్లలో దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఏటా 1,000 మంది విద్యార్థుల ల్యాప్‌టాప్‌లకే రూ.5.16 కోట్లు ఖర్చు చేస్తుండగా ఈసారి 1,500 ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేశారు. ఇటీవలి కాలంలో 1,200 ల్యాప్‌టాప్‌లను రూ. 6 వేలకు ఒకటి చొప్పున అమ్మేసినట్లు ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయి. అంటే రూ. 6.19 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్‌ లను రూ.కోటికి మించకుండా విక్రయించినట్లు తెలిసింది. 

ప్రభుత్వానికి ఫిర్యాదులు.. 
బాసర ట్రిపుల్‌ఐటీలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో వాటిపై దృష్టి సారించింది. ట్రిపుల్‌ఐటీలోని మూడు క్యాంటిన్ల నిర్వహణ కోసం పిలిచిన టెండర్లలో ఆరు సంస్థలు పాల్గొన్నాయి. అందులో మూడు సంస్థలను డిస్‌క్వాలిఫై చేసి మరో మూడు సంస్థలకు మాత్రమే రూ.95ల రేటుతో నిర్వహణ పనులను అప్పగిస్తూ ఖరారు చేసింది.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top