గిరిజన నియోజకవర్గాలపై మల్లగుల్లాలు! | Confuse on Tribal constituencies | Sakshi
Sakshi News home page

గిరిజన నియోజకవర్గాలపై మల్లగుల్లాలు!

Dec 19 2017 1:57 AM | Updated on Aug 15 2018 9:40 PM

Confuse on Tribal constituencies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  చినికి చినికి గాలివానగా మారిన గిరిజన తెగల ఆందోళనలు, వచ్చే ఎన్నికల్లో ఆ వర్గాలు చూపే ప్రభావంపై అధికార పార్టీలో చర్చ మొదలైంది. ఆది వాసీలు, లంబాడీల మధ్య నెల రోజులుగా ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో గిరిజన నియోజకవర్గాల్లో పరిస్థితిపై పార్టీ అధి నాయకత్వం దృష్టి సారించింది. వచ్చే ఎన్నిక ల్లో గిరిజన స్థానాలన్నింటినీ తామే గెలుచు కుంటామని పీసీసీ చీఫ్‌ ఇటీవల చేసిన ప్రకట నల నేపథ్యంలో అప్రమత్తమైంది. రాష్ట్రంలో అశాంతి నెలకొల్పేందుకు కాంగ్రెస్‌ పార్టీయే ఈ గొడవలను ప్రోత్సహిస్తోందంటూ ఇప్పటి కే టీఆర్‌ఎస్‌ నేతలు దాడి మొదలుపెట్టారు. ఉట్నూరు కేంద్రంగా జరగిన హింసాత్మక ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిం చింది. అటు ఆదివాసీలు, ఇటు లంబాడీలు ఇరువురూ తమకు కావాల్సిన వారేనని అధికా ర పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఒక సందేశం పంపే ప్రయత్నం కూడా చేశారు. ఈ మేరకు గిరిజన నియోజకవర్గాలు అధికంగా ఉన్న ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల మంత్రులతో మంతనాలు జరిపారు. రెండు గిరిజన తెగల ఆందోళనలతో పార్టీ పరంగా నష్టం జరిగే అంశాలు, అవకాశాలపైనా చర్చ జరిగిందని చెబుతున్నారు.

నియోజకవర్గాల వారీగా అంచనా!
రాష్ట్రంలో 12 ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలు ఉండగా.. గత సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుచుకున్నది ఐదు స్థానాలే. కానీ ఆ తర్వాత జరిగిన చేరికల ద్వారా వైఎస్సార్‌సీపీ నుంచి ముగ్గురు, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒక గిరిజన ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో 11 గిరిజన స్థానాలు టీఆర్‌ఎస్‌ చేతిలోకి వెళ్లిపోయాయి. మరో స్థానంలో సీపీఎం ఎమ్మెల్యే ఉన్నారు. ఇక ఉన్న రెండు ఎస్టీ రిజర్వ్‌డ్‌ ఎంపీ స్థానాలు టీఆర్‌ఎస్‌ చేతిలోనే ఉన్నాయి. అయితే తాజాగా గిరిజన తెగల మధ్య జరుగుతున్న ఆందోళనలు.. అధి కార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నా రు. దీంతో వాస్తవ పరిస్థితులను తెలుసుకుని నష్ట నివారణ చర్యలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ నాయకత్వం భావిస్తోందని చెబుతున్నారు.

బుజ్జగించేందుకు యత్నాలు..
పాత ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్, బోథ్, సిర్పూరు–టి నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో ఆదివాసీలపైనే విజయం ఆధారపడి ఉంటుందని.. ఖానాపూర్, బెల్లంపల్లి, నిర్మల్‌ నియోజకవర్గాల్లోనూ గణనీ యంగా వారి ప్రాబల్యం ఉందని చెబుతున్నా రు. పాత వరంగల్‌ జిల్లా పరిధిలోని భూపాల పల్లిలో ప్రభావం చూపే స్థాయిలో, ములుగు లో పూర్తిగా ఆదివాసీ ఓటర్లే కీలకమని పేర్కొంటున్నారు. పాత ఖమ్మం జిల్లా పరిధిలోని భద్రాచలం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేటల్లో ఆదివాసీల సంఖ్య ఎక్కువని.. డోర్నకల్, మహబూబాబాద్, దేవరకొండ, వైరా నియోజకవర్గాల్లో లంబాడీల ఓట్లు కీలకమని స్పష్టం చేస్తున్నారు. ఇక ఉన్న రెండు ఎస్టీ రిజర్వ్‌డ్‌ ఎంపీ స్థానాలైన ఆదిలాబాద్, మహబూబా బాద్‌లలో రెండు వర్గాలూ గెలుపోటములను ప్రభావితం చేయగలుగుతాయని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు అటు ఆదివాసీలను, ఇటు లంబాడీల ను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు. హైదరాబాద్‌లో తుడుందెబ్బ సభకు అనుమతించడం, ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీలు తమ తండాల మీద దాడులకు పాల్పడడంతో లంబాడీల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించే పనిలో పడ్డారని సమాచారం. ముఖ్యంగా పాత ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని నాలుగు ఎస్టీ నియోజకవర్గాల్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని.. ఆయా చోట్ల పార్టీకి కాయకల్ప చికిత్స చేసే వ్యూహంలో టీఆర్‌ఎస్‌ ఉందని సమాచారం.  

Advertisement
 
Advertisement
Advertisement