గిరిజన జంటలకు సామూహిక పెళ్లిళ్లు

Collective weddings to the Tribal couples - Sakshi

బెజ్జూర్‌(సిర్పూర్‌): కుమురం భీం జిల్లా బెజ్జూర్‌ మండలంలో సోమిని గ్రామ శివారు, ప్రాణహిత నది ఒడ్డున నిర్వహించిన సమ్మక్క–సారలమ్మ జాతరలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో మంగళవారం 58 గిరిజన జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. మంత్రి జోగు రామన్న, ఐటీడీఏ చైర్మన్‌ లక్కెరావు, ఎమ్మెల్యే సతీమణి రమాదేవిలతో పాటు అరిగెల నాగేశ్వరరావు పెళ్లి పెద్దలుగా హాజరై గిరిజన జంటలను ఆశీర్వదించారు. నూతన వధూవరులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కుటుంబ సభ్యులు మంగళసూత్రాలు, మెట్టెలు అందించారు.

ఎమ్మెల్యేతోపాటు మంత్రి నూతన వధూవరులకు గృహోపయోకరణ సామగ్రిని అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ కేసీఆర్‌ మంత్రి వర్గంలో ఉండి 58 నూతన జంటలను ఆశీర్వదించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ ఈ 58 జంటలే కాకుండా మరో 116 జంటలకు సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు చేయిస్తానన్నారు. త్వరలో సిర్పూర్‌పేపర్‌ మిల్లును తెరిపించి కార్మికుల కష్టాలను తొలగించేంత వరకు నిద్రపోనన్నారు. కార్యక్రమంలో కోనేరు ట్రస్ట్‌ అధ్యక్షుడు కోనేరు వంశీ దంపతులు, జెడ్పీటీసీ సభ్యులు కోండ్ర శారద జగ్గాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top