జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

CM KCR Pay Tributes To Jaipal Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి(77) భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. ప్రగతి భవన్‌ నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్లిన కేసీఆర్‌.. జైపాల్‌రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులను కేసీఆర్‌ ఓదార్చారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీ కేకే సంతోష్‌,  గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

 కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీని సీఎం కేసీఆర్‌  ఆదేశించారు. నెక్లెస్‌ రోడ్డులోని పీవీ నరసింహారావు ఘాట్‌ పక్కన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 9 గంటలకు జూబ్లిహిల్స్‌లోని జైపాల్‌రెడ్డి స్వగృహం నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సందర్శకుల దర్శనార్థం గాంధీభవన్‌లో మాధ్యాహ్నం రెండు గంటల వరకు పార్థీవదేహాన్ని అక్కడే ఉంచుతారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top