‘కేబుల్‌ చానళ్ల ఎంపిక’పై హైకోర్టులో ముగిసిన వాదనలు 

Claims of  cable channels selection concluded in the high court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేబుల్‌ టీవీ చానళ్ల ఎంపికకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌) తీసుకొచ్చిన కొత్త నిబంధనల అమలుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్న నేపథ్యంలో, వాటి అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న స్థానిక కేబుల్‌ ఆపరేటర్ల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, ట్రాయ్‌ ఏకపక్షంగా కొత్త నిబంధనలను రూపొందించిందని, అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ స్థానిక కేబుల్‌ ఆపరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు గురువారం విచారణ జరిపారు. కొత్త నిబంధనల వల్ల నష్టపోయేది తామేనని పిటిషనర్లు వివరిం చారు. ట్రాయ్‌ కొత్త నిబంధనలను రూపొందించేటప్పుడు తమను సంప్రదించలేదన్నారు. ఈ వాదనలను అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) తోసిపుచ్చారు. వీక్షకుల ప్రయోజనాల మేరకే ట్రాయ్‌ కొత్త నిబంధనలను తీసుకొచ్చిందన్నారు. వీక్షకులు తమకు నచ్చిన చానళ్లనే ఎంపిక చేసుకుంటారని, దీని వల్ల వారు తక్కువ మొత్తాన్ని చెల్లిస్తారని తెలిపారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top