ముగిసిన గడువు..నెరవేరని లక్ష్యం

Central Power Lines Work Not Completed Karimnagar - Sakshi

నల్లగొండ: గడువు ముగిసింది... కానీ లక్ష్యం నెరవేరలేదు. ఓ పక్క నిధుల కోసం ఆరాటపడుతుంటే.. మరోపక్క వచ్చిన నిధులను కూడా సవ్యంగా ఖర్చు చేయలేని పరిస్థితుల్లో జిల్లా విద్యుత్‌శాఖ ఉంది. కేంద్రప్రభుత్వం గత ఏప్రిల్‌ మాసంలో జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో లోఓల్టేజీ సమస్యతోపాటు పట్టణ విస్తరణకు అనుగుణంగా కొత్త లైన్ల ఏర్పాటు, పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఐపీడీఎస్‌ (ఇంటిగ్రేటెడ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ స్కీం)  కింద రూ. 32కోట్లను మంజూరు చేసింది.

గత సంవత్సరం ఏప్రిల్‌ మాసంలో నిధులు మంజూరు చేసి వాటిని అదే ఏడాది 2018 నాటికి పూర్తి చేయాలని గడువు విధించింది. గడువు ముగిసినా పనులు పూర్తి కాలేదు. పట్టణీకరణ పెరుగుతుండడంతో అందుకనుగుణంగా విద్యుత్‌పనులు మెరుగుపర్చడం, లోఓల్టేజీ సమస్య తీర్చేందుకు కొత్త సబ్‌ స్టేషన్లు, పెరిగిన కాలనీల్లో కొత్త లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఐపీడీ పథకాన్ని చేపట్టింది. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపాలిటీల్లో వివిధ పనులు చేపట్టేందుకు రూ. 32 కోట్లు మంజూరు చేసింది. గత ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా అవి నేటికీ పూర్తి కాలేదు.

నల్లగొండ టౌన్‌లో...
నల్లగొండ పట్టణంలో మొత్తం 13 పనులు మంజూరయ్యాయి. అందుకు సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్‌ ఒకటి మంజూరు కాగా దాన్ని పూర్తి చేశారు. 33 కేవీ లైన్లు పట్టణంలో మూడు మంజూరైతే అవి ఇంకా పురోగతిలోనే ఉన్నాయి. మూడు లైన్లు, 33 కేవీ బ్రేకర్లు ఒకటి మంజూరు కాగా, వాటిని నేటి వరకు పూర్తి చేయలేదు. బైఫరికేషన్‌ ఆఫ్‌ 11 కేవీ ఫీడర్స్‌ ఆరు పనులు మంజూరు కాగా, ఇప్పటికి రెండు మాత్రమే పూర్తయ్యాయి. మరో 4 పనులు కొనసాగుతున్నాయి. ఎక్స్‌టెన్షన్‌ 11 కేవీ బ్రేకర్‌ 1, 11 కేవీ ఫీడర్స్‌ ఆగ్మెంటేషన్‌ పనులు కొనసాగుతున్నాయి. 160 కేవీ పనులు 10లో సగం పూర్తయి, సగం కొనసాగుతున్నాయి. డీ 100 కేవీఏ పనులు 80 పూర్తి కాగా, 100 నుంచి 160 కేవీ మార్పు పనులు పూర్తయ్యాయి.

డీ63 నుంచి 100 కేవీఏ పనులు 20 మంజూరు కాగా, 3 మాత్రమే పూర్తయ్యాయి. ఎల్‌టీ లైన్లకు సంబంధించి 3ఫేస్‌ 5 వాల్ట్‌లైన్లు 50 మంజూరైతే 15 మాత్రమే పూర్తయ్యాయి. ఎల్‌టీ లైన్ల బైఫరికేషన్‌ 15 మంజూరు కాగా 5 పూర్తయ్యాయి. ఎల్‌టీ లైన్ల ఆగ్మెంటేషన్‌ 5 పనులకు 5 ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్‌టీ లైన్లు 1ఫేజ్‌ 2వాల్ట్స్‌ నుంచి 3ఫేజ్‌ 5వాల్ట్స్‌ పనులు 15 పనులకు 15 పనులు పూర్తి చేశారు. కెపాసిటర్‌ బ్యాంకులు 5, 11 కేవీ ఎక్‌ఎల్‌పీఈ ఏరియల్‌ బంచ్‌డ్‌ కేబుల్‌ 10, ఎల్‌టీఎల్‌పీఈ ఏరియల్‌ బంచ్‌డ్‌ కేబుల్‌ 70 ఎస్‌క్యూఎంఎం, 150 రూఫ్‌ సోలార్‌ ప్రాజెక్టులు, మీటరింగ్‌ ఫీడర్స్‌ 10, మీటరింగ్‌ డీటీఆర్‌ఎస్‌ 200, మీటరింగ్‌ కంజ్యూమర్స్‌ 2వేలు మంజూరు కాగా ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు 265 మంజూరు కాగా వాటిని కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో బిగించని పరిస్థితి.

దేవరకొండలో...
దేవరకొండ పట్టణంలో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 33 కేవీ బ్రేకర్లు, కొత్తగా 33 కేవీ లైన్లు 5, 11కొత్తగా 11 కేవీ ఫీడర్లతో పాటు 11 కేవీ బ్రేకర్లను ఎక్స్‌టెన్షన్‌ చేసేందుకు మరో రెండు మంజూరు చేసినా అవి పురోగతిలోనే ఉన్నాయి. 11 కేవీ ఫీడర్స్‌ ఆగ్మెంటేషన్‌ పనులు ఐదు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్తగా ఎల్‌టీ లైన్లు 30 మంజూరు కాగా 22 పూర్తయి 8 పురోగతిలో ఉన్నాయి. 20ఎల్‌టీ లైన్ల బైఫరికేషన్‌లో 5 పనులు మాత్రమే పూర్తి కాగా ఆగ్మెంటేషన్‌ ఆఫ్‌ ఎల్‌టీ లైన్‌ 5, కన్వర్షన్‌ ఆఫ్‌ ఎల్‌టీలైన్‌ ఫేజ్‌ 2 నుంచి 5ఫేజ్‌ 5వాల్ట్స్‌ పనులకు మార్పు పనులు పురోగతిలో ఉన్నాయి. ఎల్‌టీఎస్‌పీఈ ఏరియల్‌ బంచ్‌డ్‌ కేబుల్‌ 70ఎస్‌క్యూఎంఎం పనులు 5, 11 కేవీ అండర్‌గ్రౌండ్‌ పనులు రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్రాజెక్టులు 40 ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మిగిలిన పనులు 80 శాతం పూర్తయ్యాయి.

మిర్యాలగూడలో..
మిర్యాలగూడ పట్టణంలో 33/11 కేవీ సబ్‌ స్టేషన్లు 2 మంజూరు కాగా ఒక్కటి కూడా పూర్తి కాలేదు. 33 కేవీ లైన్లు 10 మంజూరైతే మూడే పూర్తయ్యాయి. 10 బైఫరికేషన్‌ ఆఫ్‌ 11 కేవీ ఫీడర్స్‌ మంజూరు కాగా ఒక్కటి కూడా పూర్తి కాలేదు. అదే విధంగా ఎక్స్‌టెన్షన్‌ విత్‌ 11 కేవీ బ్రేకర్లు 2, 11 కేవీ ఫీడర్స్‌ ఆగ్మెంటేషన్‌ పనులు 5 ఏవీ కూడా పూర్తి కాలేదు. డీ100 కేవీఏ పనులు 30, ఎ100 నుంచి 160 కేవీఏ పనులు 90 శాతం పూర్తయ్యా యి. అందులోని మరికొన్ని పనులు 20శాతం కూ డా పూర్తి కాలేదు.

ఎల్‌టీ లైన్లకు సంబంధించి కొత్త ఎల్‌టీ లైన్లు, బైఫరికేషన్‌ ఎల్‌టీ లైన్లు, ఆగ్మెంటేషన్‌ ఆఫ్‌ ఎల్‌టీ లైన్లు, కన్వర్షన్‌ ఆఫ్‌ ఎల్‌టీ లైన్లు, 1 ఫేజ్‌ 2వాల్ట్స్‌ నుంచి 3ఫేజ్‌ 5వాల్ట్స్‌కు సంబంధించిన 10 పనులు ఇంకా పురోగతిలోనే ఉన్నాయి. కెపాసిటర్‌ బ్యాంక్‌ పనులు 5, 11 కేవీ ఎక్స్‌ఎల్‌పీఈ ఏరియల్‌ బంచ్‌డ్‌ కేబుల్‌ 10, అందులోనే బంచ్‌డ్‌ కేబుల్‌ 70 ఎస్‌క్యూ ఎంఎం పనులు 10, 11 కేవీ అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌ పనులు 2, రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్రాజెక్టులు 30, 89 ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల బిగింపు పనులు కూడా కాలేదు. కొన్ని ప్రారంభమై పనులు కొనసాగుతుండగా, మరికొ న్ని నేటికీ ప్రారంభంకాని పరిస్థితి నెలకొంది.

ఇచ్చిన నిధులు ఖర్చు చేస్తేనే...
కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాల అభివృద్ధికి అయితే నిధులు కేటాయిస్తుందో వాటిని గడువులోగా పూర్తి చేయాలి. అప్పుడే తిరిగి ఆ రాష్ట్రాలకు కొత్తగా వచ్చే స్కీములను ఇచ్చేందుకు సుముఖత చూపుతారు. అధికారులు జిల్లాకు మంజూరైన వాటిని త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అసంపూర్తిగా ఉన్న పనులు మార్చి నాటికి పూర్తి చేయాలని కేంద్రం గడువు విధించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ గడువులోపు పూర్తవుతాయో..లేవో చూడాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top