
రొమ్ము కేన్సర్ గుర్తింపులో అద్భుతం
వైద్య చరిత్రలో మరో అద్భుతం ఆవిషృతం కాబోతోంది. బయాప్సీ, మామోగ్రఫీ వంటి ఖరీదైన పరీక్షలతో పని
► ఆరు రాష్ట్రాల్లోని ఏడు ఆస్పత్రుల్లో ప్రయోగాలు
► విజయవంతమైతే.. పావుగంటలో రూ.130కే కేన్సర్ నిర్ధారణ
► ప్రముఖ రొమ్ము కేన్సర్ నిపుణుడు డాక్టర్ రఘురామ్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వైద్య చరిత్రలో మరో అద్భుతం ఆవిషృతం కాబోతోంది. బయాప్సీ, మామోగ్రఫీ వంటి ఖరీదైన పరీక్షలతో పని లేకుండానే కేవలం చుక్క రక్తంతో ప్రాథమిక దశలోనే రొమ్ము కేన్సర్ను గుర్తించే అత్యాధునిక వైద్యపరిజ్ఞానం అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే దీనిపై అమెరికాలో పరిశోధనలు పూర్తై సీఈ సర్టిఫికెట్ కూడా పొందింది. మనదేశంలో ఖచ్చితమైన ఆధారాల కోసం క్లినికల్ రీసెర్చ్ ప్రారంభమైంది. త్వరలోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
రాబోయే ఫలితాల ఆధారంగా మరింత మంది రోగులకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఒక వేళ ఇది విజయ వంతమైతే ఖరీదైన రొమ్ము కేన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్ష కేవలం రూ.130కే అందనుంది. ఈ మేరకు శనివారం హోటల్ ఐటీసీ కాకతీయలో సినీ నటి మంచు లక్ష్మి, పీఓసీ మెడికల్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ సక్సెనా, ఉషాలక్ష్మి బ్రెస్ట్కేన్సర్ ఫౌండేషన్(యూబీఎఫ్) సీఇఓ డాక్టర్ పి.రఘురామ్ సంయు క్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘మమోఅలర్ట్’వైద్య పరికరం పనితీరుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో పరీక్షలు...
రొమ్ము కేన్సర్ దేశానికి పెద్ద మహమ్మారిలా మారింది. ఏటా దేశంలో 1.54 లక్షల కేసులు నమోదవుతుండగా, వీటిలో 60శాతం అడ్వాన్స్ స్టేజీలో ఉంటున్నాయి. వ్యాధి నిర్థారణ అయిన ప్రతి ఇద్దరు రొమ్ము కేన్సర్ బాధితుల్లో ఒకరు మృత్యువాత పడుతున్నారు.
రొమ్ము కేన్సర్ మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన పీఓసీ మెడికల్ సిస్టమ్ సంస్థ దీని నిర్ధారణ కోసం ‘మమోఅలర్ట్’అనే వైద్య పరికరాన్ని రూపొందించింది. అమెరికాలో ఇప్పటికే 600 మంది నుంచి నమూనాలు సేకరించి, ఉత్తమ ఫలితాలు సాధించింది. ఉషాలక్ష్మి బ్రెస్ట్కేన్సర్ ఫౌండేషన్ (యూబీఎఫ్) సీఇఓ డాక్టర్ పి.రఘురామ్ సలహా మేరకు ఖచ్చితమైన ఫలితాలు సాధించి, ఇక్కడి రోగులకు నమ్మకం కలిగించేందుకు దేశవ్యాప్తంగా మరో 2,400 నమూనాలు సేకరించి పరీక్షించాలని నిర్ణయించింది.
15 నిమిషాల్లోనే ఫలితం
హైదరాబాద్లోని కిమ్స్ సహా ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి, మణిపాల్ ఆస్పత్రి (బెంగళూరు), టాటా మెడికల్ సెంటర్ (కోల్కతా) మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ (న్యూఢిల్లీ), అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడి కల్ సైన్స్(కొచ్చి), హెచ్సీజీ కేన్సర్ సెంటర్ (అహ్మదాబాద్)ను పీఓసీ, యూబీఎఫ్ సం యుక్తంగా ఎంపిక చేశాయి. ఇప్పటికే కిమ్స్లో పదిహేను రోజుల్లో వంద మంది(30 మంది వ్యాధి నిర్ధారణ అయిన రోగులు, 70 మంది అనుమానితుల)నుంచి నమూనాలు సేకరిం చి, పరీక్షలకు పంపించాయి.
దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాలు, వచ్చిన ఫలితాలను విశ్లేషించి తుది నిర్ణయం తీసుకోనున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వ సహకారంతో ఈ సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలని నిర్ణ యించాయి. అయితే కొత్తగా అందుబాటులో కి వచ్చే ఈ వైద్య పరికరం ద్వారా తక్కువ ఖర్చుతో 15 నిమిషాల్లో వ్యాధిని నిర్ధారించ డంతో పాటు మారుమూల ప్రాంతాలకు సులభంగా తీసు కెళ్లే అవకాశం ఉంది. ఒకే సమయంలో పది శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతమున్న మామోగ్రామ్ పరీక్షకు ఇది ప్రత్యామ్నాయం కాదని రఘురామ్ వెల్లడించారు.