సాక్షి, హైదరాబాద్: కార్మికుడిగా ఉద్యోగంలో చేరినప్పుడు వయసును నిర్ధారిస్తూ వైద్యుడు ఇచ్చే ధ్రువపత్రమే చెల్లుబాటు అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఏళ్ల తరబడిగా ఉన్న రికార్డుల్లోని పుట్టిన తేదీని, స్కూల్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఆధారంగా మార్పు చేయడానికి సింగరేణి కాలరీస్ నిరాకరించడాన్ని సమర్ధించింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రామ్బ్రిచ్ యాదవ్ 1971లో సింగరేణి కాలరీస్లో కార్మికుడిగా చేరినప్పుడు ఆయన 1951 డిసెంబర్ 5న జన్మించినట్లు వైద్యులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు.
అంచెలంచెలుగా పదోన్నతి పొందిన యాదవ్ ఇటీవల తాను 1946లో జన్మించినట్లుగా రికార్డులు మార్పు చేయాలని స్కూల్ ఇచ్చిన టీసీని సాక్ష్యంగా పేర్కొంటూ సమర్పించిన వినతిపత్రాన్ని సింగరేణి యాజమాన్యం తోసి పుచ్చింది. దాంతో యాదవ్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఇటీవల న్యాయ మూర్తి జస్టిస్ అభినంద్కుమార్ షావిలి వెలువరించిన తీర్పులో సింగరేణి యాజ మాన్య చర్యల్లో జోక్యం చేసుకోబోమని తెలిపారు. ఏళ్ల తరబడి సర్వీస్ రికార్డుల్లో ఉన్న పుట్టిన తేదీని ఇప్పుడు మార్పు చేయాలని కోరడం చెల్లదన్నారు. యాదవ్ సర్వీసులో చేరినప్పుడు వేలిముద్ర వేశారని, తర్వాత రికార్డుల్లో కూడా నిశానీ గానే ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు.


