ఆటో, కారు ఢీ : ఇద్దరు దుర్మరణం | Auto and car accident two people died | Sakshi
Sakshi News home page

ఆటో, కారు ఢీ : ఇద్దరు దుర్మరణం

Jul 28 2015 11:18 PM | Updated on Apr 3 2019 7:53 PM

ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి

♦ మరో ఇద్దరికి గాయాలు
♦ మృతుల్లో ఇంటర్ విద్యార్థి, ఆటో డ్రైవర్
♦ ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమ ఎదుట ప్రమాదం
 
 సదాశివపేట : ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సదాశివపేట మండలం ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమ వద్ద చోటు చేసుకున్న సంఘటనపై సదాశివపేట సీఐ శ్రీనివాస్‌నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలం కల్గోడ గ్రామానికి చెందిర రఫీయుద్దీన్ తన ఆటోలో సదాశివపేటకు వస్తున్నాడు. మునిపల్లి మండలం ఇబ్రహీంపూర్ వద్ద అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థులు విక్రమ్‌గౌడ్, జావేద్ ఆటోలో ఎక్కారు. ఆటో ఆరూర్ చేరుకున్నాక పదవ తరగతి విద్యార్థి మధు ఆటోలో చేరాడు.

ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న ఆటో సదాశిపేటలోని ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమవద్దకు రాగానే హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో సదాశివపేట ఉజ్వల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విక్రమ్‌గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ రఫీయుద్దీన్, జావేద్, మధును చికిత్స నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.

వీరిలో రఫీయుద్దీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.  జావేద్ సదాశివపేటలోని ప్రగతి కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుండగా, మధు ఇండో బ్రిటీష్‌స్కూల్‌లో పదవ తరగతి విద్యార్థి. కాగా ప్రమాదానికి కారణమైన కారు ఆచూకీ తెలియలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement