ఆ పోలీసులపై 302 సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆర్‌  | Another PIL Of High Court Is To File Cases Against Police Involved In Encounter | Sakshi
Sakshi News home page

ఆ పోలీసులపై 302 సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ 

Dec 12 2019 2:43 AM | Updated on Dec 12 2019 11:38 AM

Another PIL Of High Court Is To File Cases Against Police Involved In Encounter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆటవికంగా ‘దిశ’నిందితులు నలుగురిని ఎన్‌కౌంటర్‌ పేర హతమాచ్చారని, ఇందుకు బాధ్యులైన పోలీసులపై ఐపీసీలోని 302 సెక్షన్‌ కింద హత్యానేరం కేసులు నమోదు చేయాలని హైకోర్టులో మరో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. పీయూ సీఎల్‌–మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలీసులపై 302 సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్నారు. తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేని ఇతర రాష్ట్రాల పోలీసులపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఉస్మా నియా విశ్వవిద్యాలయం రిటైర్డు ప్రొఫెసర్‌ రామశంకరనారాయణ మేల్కొటె, రిటైర్డు లెక్చరర్‌ ఎస్‌.జీవన్‌కుమార్‌ సంయుక్తంగా పిల్‌ దాఖలు చేశారు.

దిశ ఘటన తర్వాత ఏర్పడిన భావోద్వేగాల నేపథ్యంలో తక్షణ న్యాయం పేరుతో పోలీసులు నలుగురు నిందితులను బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో పోలీసులు వినియోగించిన ఆయుధాలపై బాలిస్టిక్‌ నిపుణులతో పరీక్షలు చేయించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటో లు, ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టులను భద్రం చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని పిల్‌లో కోరారు. అయితే ఇదే తరహాలో ఇప్పటికే దాఖలైన రెండు వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. మంగళవారం మరో మూడు వ్యాజ్యాలు దాఖలు కావడంతో మొత్తం ఐదు వ్యాజ్యాలను గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.  

ఎన్‌కౌంటర్‌ ప్రదేశాన్ని పరిశీలించిన పౌర హక్కుల నేతలు 
షాద్‌నగర్‌టౌన్‌: దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన ప్రదేశాన్ని, నిందితులు దిశను దహనం చేసిన చటాన్‌పల్లి బ్రిడ్జి కింది ప్రదేశాన్ని బుధవారం పౌర హక్కుల సంఘం నాయకులు పరిశీలించారు. ఎన్‌కౌంటర్‌ ఎలా జరిగింది, హంతకులను పోలీసులు ఎక్కడ ఎన్‌కౌంటర్‌ చేశారన్న విష యాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం సమీపానికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు వారిని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దనే అడ్డుకున్నారు. దీంతో వారు జాతీయ రహదారిపై నుంచే ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని చూశారు.  

Advertisement
 
Advertisement
Advertisement