ఎక్కడికి పోయావ్‌ బుజ్జీ..?     

Announcement for the cat - Sakshi

పిల్లి అదృశ్యంపై ఓ మహిళ ప్రకటన

తెచ్చిన వారికి రూ.2 వేల బహుమతి

సాక్షి, హైదరాబాద్‌ : పెంపడు జంతువులపై ప్రతి ఒక్కరికీ ఎంతోకొంత ప్రేమ ఉంటుంది. ఇంట్లో ముద్దుగా పెంచుకునే శునకాలు, పిల్లులు, పక్షులకు పుట్టినరోజును వేడుకగా చేసేవారు.. అలాంటివి చనిపోతే.. సొంతవారు పోయినట్టు కర్మకాండలు చేసేవారు.. నగరంలో చాలామందే ఉన్నారు. ఒకవేళ అనుకోకుండా అలాంటివి తప్పిపోతే వాటికి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చేవారు ఉన్నారు.

ఈ కోవలోనే ఫిలింనగర్‌కు చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లి తప్పిపోయిందని, వెతికి తెచ్చినవారికి బహుమతి ఇస్తానంటూ ఇంటింటికీ కరపత్రాలు పంచారు. గోడలపై సదరు పిల్లి ఫొటోతో పాటు దాని వయసు, ఎత్తు, పొడవు కొలతలతో సహా పోస్టర్లు సైతంఅంటించారు. తన పిల్లిన అప్పగించినవారికి రూ.2 వేలు రివార్డు కూడా ప్రకటించారు. ఇంతకూ సదరు మార్జాలం ఏ విదేశాల నుంచో తెచ్చిన అరుదైన జాతి కాదు..

ఇళ్లలో తిరిగే మామూలు పిల్లిని ఆమె ఏడాదిగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఒంటరిగా ఉండే ఆమె పిల్లి తోడుగా జీవిస్తున్నారు. అది కనిపించకుండా పోవడంతో ఆమె తట్టుకోలేకపోతున్నారు. వారం రోజులుగా ఆమె ఫిలింనగర్, జూబ్లిహిల్స్‌ ప్రాంతాల్లోని వీధివీధీ జల్లెడ పడుతున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top