నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ 10న

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీన నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో దీనికి సంబంధించిన ఆల్బెండజోల్‌ మాత్రలను ఇస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు గైర్హాజరైన విద్యార్థులకు ఈ నెల 17వ తేదీన మాత్రలు ఇస్తామన్నారు. 1–19 ఏళ్ల మధ్య వయసు కలిగిన 99.56 లక్షల మంది పిల్లలకు ఈ మాత్రలు అందజేస్తామని పేర్కొన్నారు.

పిల్లల్లో సాధారణంగా ఏలిక, నులి, కొంకి పురుగులు కనిపిస్తుంటాయని, ఇవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి వృద్ధి చెందుతాయన్నారు. ఈ పురుగులు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణాలు బహిరంగ మల విసర్జన, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడమేనని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 41,337 మంది ఉపాధ్యాయులు, 35,700 అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు ఆల్బెండజో ల్‌ మాత్ర వేయడంలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మాత్ర వేసుకోవడం వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవని, నులిపురుగుల సంక్రమణ ఎక్కువగా ఉన్న పిల్ల ల్లో వికారం, వాంతులు, కళ్లు తిరగడం లాంటివి ఉండే అవకాశముందన్నారు. ప్రతికూల ప్రభావాల కు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top