ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్ | ACB Entrapped by Sub Registrar | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్

Mar 23 2014 4:02 AM | Updated on Oct 17 2018 6:06 PM

సబ్‌రిజిస్ట్రార్ రవీందర్  లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవడం ఇక్కడ సంచలనం కలిగిం చింది - Sakshi

సబ్‌రిజిస్ట్రార్ రవీందర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవడం ఇక్కడ సంచలనం కలిగిం చింది

జిల్లా కేంద్రంలో జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ రవీందర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవడం ఇక్కడ సంచలనం కలిగించింది.

 నిజామాబాద్ క్రైం, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలో జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ రవీందర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవడం ఇక్కడ సంచలనం కలిగించింది. ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్‌లు ఇవ్వడానికి ఆయన డబ్బులు డిమాండ్ చేయడం తో బాధితుడు ఏ సీబీ అధికారును ఆశ్రయించారు. నగరంలోని బోధ న్ రోడ్డు ప్రాంతం లో నివాసం ఉం డే మీర్ జావెద్ అలీ తనకు వరుసకు సోదరుడైన నిస్సార్ మొయినుద్దీన్ నుంచి ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

 ఆయన ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. అతనికి సంబంధించిన రెండు ఓపెన్ ప్లాట్లు, రెండు ఇండ్లు, మూడు షాపులు నగరంలోని ఖలీల్‌వాడి ప్రాం తంలో ఉన్నాయి. వీటిని మీర్ జావేద్ అలీ కొనుకున్నారు. ఆస్తులు ఒక కోటి రూపాయలు విలువ చేయగా.. జనరల్ పవర్ ఆఫ్ అటార్ని (జీపీఏ)రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఒక శాతం కింద 1 లక్ష రూపాయలను రిజిస్ట్రార్ కార్యాలయంలో జనవరి 25న చెల్లించారు. దాంతో అధికారులు ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని పూర్తి చేశారు.

 పథకం ప్రకారం
 ఈ డాక్యుమెంట్స్ 24 గంటల్లోగా ఆస్తులు కొనుగోలు చేసిన వ్యక్తులకు ఇవ్వవలసి ఉంటుంది. పూర్తి చేసిన డాక్యుమెంట్స్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని సబ్ రిజిస్ట్రార్-2 ఎల్ రవీందర్ తన వద్ద ఉంచుకున్నారు. తనకు రూ. 60 వేలు ఇస్తేనే డాక్యుమెంట్స్ ఇస్తానని జావెద్ అలీతో పేర్కొన్నారు. కొన్ని రోజులు కార్యాలయం చుట్టూ తిరిగిన జావెద్ చివరికి రూ.30 వేలు ఇవ్వడానికి సబ్ రిజిస్ట్రార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

అయితే లంచం ఇవ్వటం ఇష్టం లేని జావెద్ అలీ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం ఏసీబీ అధికారులు కెమికల్ పూసి ఇచ్చిన నోట్లను జావెద్ శనివారం మధ్యాహ్నం రైల్వేస్టేషన్ రోడ్డు, కవితా కాంప్లెక్స్‌లోని సబ్‌రిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి రవీందర్‌కు అందించారు. సబ్‌రిజిస్ట్రార్ డబ్బులను తన టేబుల్ డ్రాలో వేసుకుంటుండగా అక్కడే కాపుకాసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

సబ్ రిజిస్ట్రార్ టేబుల్ డ్రాలో ఉన్న మరో రూ.44,700 లను కూడా స్వాధీనం చేసుకున్నారు. రవీందర్‌ను అరెస్టు చేసి హైదరాబాద్ ఏసీబీ స్పెషల్‌కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సంజీవరావు విలేకరులతో తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్ రఘునాథ్, ఎస్‌ఐ ఖుర్షీద్ అలీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement