అనుమానాస్పద స్థితిలో ఒక యువకుడు మృతి చెందాడు.
పెద్ద శంకరంపేట (రంగారెడ్డి): అనుమానాస్పద స్థితిలో ఒక యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట మండలం టెంకటి గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహేష్గౌడ్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఈర పోచయ్య, జగదాంబలకు నలుగురు కుమారులు. రెండో కుమారుడైన నవీన్ (23) రెండు రోజుల క్రితం సెల్ఫోన్ రిపేర్ చేయించుకోవడానికి పెద్దశంకరంపేట వెళ్లాడు.
తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతుకులాట ప్రారంభించారు. చివరికి మల్లన్నగుట్టపై శవమై కనిపించాడు. అతడి నోటి నుంచి రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. కాగా, అతడికి ఏడాది క్రితం పుల్కల్ మండలం పోసానిపల్లి గ్రామానికి చెందిన మంజులతో వివాహమైంది. ప్రస్తుతం గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.