జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. కలెక్టర్ ఎం.జగన్మోహన్ శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో సభ్యుల నుంచి వచ్చిన నామినేషన్లను స్వీకరించారు. 24 స్థానాలకు గాను 20 స్థానాలు జెడ్పీటీసీలకు, నాలుగు స్థానాలు మున్సిపల్ కౌన్సిలర్లకు కేటాయించిన విషయం తెలిసిందే. రూరల్ నియోజకవర్గంలోని 20 స్థానాలకు గాను 23 నామినేషన్లు దాఖలయ్యాయి. అర్బన్ నియోజకవర్గంలోని 4 స్థానాలకు గాను 6 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, జిల్లా పరిషత్ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
నామినేషన్లు ఇలా..
ఎన్నికలు జరిగే స్థానాలకు రిజర్వేషన్ల వారీగా నామినేషన్లు వచ్చాయి. రెండు మహిళా ఎస్సీ స్థానాలకు గాను 2 నామినేషన్లు, రెండు జనరల్ ఎస్సీ స్థానాలకు రెండు నామినేషన్లు, రెండు ఎస్టీ మహిళా స్థానాలకు 2 నామినేషన్లు, రెండు ఎస్టీ జనరల్ స్థానాలకు 2 నామినేషన్లు, మూడు బీసీ జనరల్ స్థానాలకు 4 నామినేషన్లు, నాలుగు బీసీ మహిళా స్థానాలకు 5 నామినేషన్లు, మూడు అన్రిజర్వుడ్ జనరల్ స్థానాలకు 4 నామినేషన్లు, రెండు అన్రిజర్వుడ్ మహిళా స్థానాలకు 2 నామినేషన్ల చొప్పు న మొత్తం 23 నామినేషన్లు దాఖలయ్యాయి. పట్టణ నియోజకవర్గంలోని 4 స్థానాలకు 6 నామినేషన్లు వచ్చాయి. ఎస్సీ మహిళా స్థానానికి ఒక నామినేషన్, బీసీ జనరల్ స్థానానికి రెండు నామినేషన్లు, అన్రిజర్వుడ్ జనర ల్ స్థానానికి రెండు నామినేషన్లు, అన్రిజర్వుడ్ మహిళా స్థానానికి ఒక నామినేషన్ చొప్పున మొత్తం పట్టణ నియోజకవర్గానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి.
17న ఎన్నికలు..
ఈనెల 15న డీపీసీకి వచ్చిన నామినేషన్లను పరిశీలి స్తారు. అదేరోజు జాబితాను ప్రకటిస్తారు. 16న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. సాయంత్రం బరి లో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 17న జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎన్నిక జరగనుంది. అనంతరం ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.