జీఎస్టీతో రాష్ట్రానికి ఏటా 2వేల కోట్ల నష్టం | 2,000 Crore Loss Annually to Telangana with the GST | Sakshi
Sakshi News home page

జీఎస్టీతో రాష్ట్రానికి ఏటా 2వేల కోట్ల నష్టం

Apr 8 2018 1:46 AM | Updated on Aug 15 2018 7:59 PM

2,000 Crore Loss Annually to Telangana with the GST - Sakshi

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

సాక్షి, హైదరాబాద్‌: జీఎస్టీ (వస్తు సేవల పన్ను)తో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ విధానంతో ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని తెలిపారు. దీన్ని పూడ్చేందుకు కేంద్రం ప్రత్యేక హామీ ఇచ్చినప్పటికీ సరైన విధానం లేకపోవడంతో నష్ట నివారణ జరగడం లేదన్నారు. శనివారం తెలంగాణ కామర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘డిజిటల్‌ కామర్స్‌ అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై  జరిగిన నేషనల్‌ కామర్స్‌ కాన్ఫరెన్స్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మార్కెట్‌కు అనుగుణంగా కామర్స్‌లో కొత్త కోర్సులు రూపొందించాలన్నారు. ఐటీ, కామర్స్‌ కలిపి అద్భుతమైన డిజిటల్‌ కామర్స్‌కు రాష్ట్రం నుంచే పునాదులు పడాలని, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఎస్‌.రామచంద్రం, పాలమూరు యూనివర్సిటీ వీసీ రాజారత్నం ఇద్దరు కలసి ఈ పనికి పూనుకోవాలని సూచించారు.  వర్సిటీలకు మంజూరు చేసిన 1,061 పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేసేందుకు అనుమతులిచ్చినప్పటికీ వాటిని భర్తీ చేసేందుకు ఆలస్యం చేస్తున్నాయం టూ వర్సిటీ పాలకమండళ్లపై అసహనం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పాపారావు, తెలంగాణ కామర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement