నగరంలోని తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 29న ఇక్కడి ఫ్రీడం పార్కులో ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమైక్య గర్జనను నిర్వహిస్తున్నట్లు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఏ. రాధాకృష్ణ రాజు, కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి తెలిపారు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు :నగరంలోని తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 29న ఇక్కడి ఫ్రీడం పార్కులో ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమైక్య గర్జనను నిర్వహిస్తున్నట్లు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఏ. రాధాకృష్ణ రాజు, కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సమైక్య గర్జనను నిర్వహిస్తామని వెల్లడించారు. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగానే ఉంచాలంటూ ఏక వాక్య తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. తీర్మాన ప్రతులను రాష్ట్రపతి, ప్రధానిలకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి నగరంలోని ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. కాగా ఈ సమైక్య గర్జనకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై అన్ని రాష్ట్రాల్లోని తెలుగు వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. తెలుగు వారు తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి లేదని వాపోయారు. విభజనను శాస్త్రీయంగా కాకుండా రాజకీయంగా చేసినందునే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. ఈ పరిణామాలకు కాంగ్రెస్ వాడిగా సిగ్గు పడుతున్నానని చెప్పారు. ఏదేమైనా విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో తెలుగు విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి ఏకే. జయచంద్రా రెడ్డి, కోశాధికారి సీవీ. శ్రీనివాసయ్య పాల్గొన్నారు