పుణే-ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు.
పింప్రి, న్యూస్లైన్: పుణే-ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. పుణే నుంచి ముంబై వైపు బండలలోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి పుణేవైపు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. వాల్వినాగ్స్ కంపెనీ వద్ద రెండు ట్రక్కులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇరువురు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కాలేవాడికి చెందిన గణేష్ భగవతి యాదవ్ (32), నాలాసోపారాకు చెందిన రాధేశామ్ పాండే (40)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కుల నుంచి కిందపడ్డ పలు సంచులను కూడా తొలగించి, వాహనం సంచారానికి ఇబ్బంది లేకుండా చేశామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.