‘వాట్సప్’లో విద్యార్థిపై దాడి | Shocking video of bullying at Delhi school goes viral, parents outraged | Sakshi
Sakshi News home page

‘వాట్సప్’లో విద్యార్థిపై దాడి

Mar 13 2014 11:26 PM | Updated on Jul 27 2018 1:16 PM

కొందరు విద్యార్థులు తమ సహచరుణ్ని రాయలేని బూతులు తిడుతూ దాడి చేస్తుండగా తీసిన వీడియో నగరవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.

 సంచలనం సృష్టిస్తున్న వీడియో
 దుర్భాషలు, కాళ్లతో తన్నులు
  దాడి చేసిన విద్యార్థుల తొలగింపు
  నగరవ్యాప్తంగా కలకలం, తల్లిదండ్రుల ఆందోళన
 
 న్యూఢిల్లీ: కొందరు విద్యార్థులు తమ సహచరుణ్ని రాయలేని బూతులు తిడుతూ దాడి చేస్తుండగా తీసిన వీడియో నగరవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మొబైల్ మెస్సేజింగ్ అప్లికేషన్ వాట్సప్‌లో బుధవారం కనిపించిన ఈ వీడియోలో కొందరు విద్యార్థులు తమ సహచరుణ్ని విపరీతంగా తిడుతూ, కొట్టడాన్ని చూసిన నగరవాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వీరంతా దక్షిణ ఢిల్లీ వసంత్‌విహార్‌లోని మోడర్న్ పాఠశాల ఆరో తరగతి విద్యార్థులని తేలింది. దాడి జరిగిన సమయంలో ఒక విద్యార్థి ఆ ఘటనను చిత్రీకరించడంతో ఈ దారుణం వెల్లడయింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు స్కూలు కార్యాలయానికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
 
 పాఠశాలలో ఫోన్లు వాడకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో యాజమాన్యం దాడి చేసిన విద్యార్థులను పాఠశాల నుంచి తొలగించినట్టు ప్రకటించింది. ‘పాఠశాలల్లో మొబైల్‌ఫోన్లను కచ్చితంగా నిషేధించాల్సిందే. ప్రైవేటు ట్యూషన్లకు వెళ్లే విద్యార్థులకు కొందరు తల్లిదండ్రులు మొబైల్‌ఫోన్లు కొనిస్తున్నారు. వాళ్లు ఫోన్లను దుర్వినియోగం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి’ అని సాల్వన్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కిరణ్ మెహతా అన్నారు. తమ పిల్లల స్నేహితులు, వాళ్లు మాట్లాడే భాషపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలని, ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. చెడు ప్రవర్తన విద్యార్థులకు స్కూళ్లలో తప్పకుండా కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు.
 
  దక్షిణఢిల్లీలో పాఠశాలలో జరిగిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలని అభిప్రాయపడ్డారు.  దాడి చేసి విద్యార్థులందరిపైనా చర్య తీసుకున్నామని స్కూలు ప్రిన్సిపాల్ మీనాక్షి సహానీ అన్నారు. ఇద్దరు విద్యార్థులకు తల్లి అయిన పలోమా గంగూలీ ఈ దారుణంపై దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు. పాఠశాల ఆవరణలో చక్కటి భాష ఉపయోగించేలా యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వీధుల్లో వాడే భాషను తమ విద్యార్థులు వాడుతున్నారని తెలిసినా పాఠశాలలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘ఇళ్లలో నౌకర్లు లేదా ఇతరులకు ఇలాంటి భాషను ఉపయోగిస్తే పిల్లలు తప్పకుండా దానిని అలవాటు చేసుకుంటారు. ఈ విషయంలో తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలకు బాధ్యత ఉంటుంది’ అని ఆమె స్పష్టం చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement