ఆరోగ్యంగా కరుణ | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంగా కరుణ

Published Sat, Dec 3 2016 1:32 AM

karunanidhi health is alright

రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్  
పరామర్శల వెల్లువ

 
డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుమార్తె, ఆ పార్టీ ఎంపీ కనిమొళి ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక, కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై పరామర్శలు వెల్లువెత్తుతున్నారుు.
 
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం. కరుణానిధి గురువారం ఉదయం న్యూట్రీషన్, డీహైడ్రేషన్ సమస్యతో ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు రెండోరోజు శుక్రవారం అక్కడి వైద్యులు చికిత్స అందించారు. కరుణానిధి వెంట ఆసుపత్రిలో ఆయన కుమారులు స్టాలిన్, అళగిరి, కుమార్తెలు సెల్వి,కనిమొళి ఉన్నారు. వృద్ధులకు చికిత్స అందించే ప్రత్యేక ఐసీయూ యూనిట్ విభాగంలో కరుణానిధి ఉన్నట్టు  సమాచారం. ఆయన ఆసుపత్రిలో చేరిన సమాచారంతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఫోన్లో పరామర్శించారు. ఎంపీ, కరుణ గారాల పట్టి కనిమొళితో ఆయన మాట్లాడారు. ఎండీఎంకే నేత వైగో, ఇక, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, సీపీఎం ఎంపీ టీకే రంగరాజన్, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఫోన్ ద్వారా పరామర్శించారు.

 ఇక, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, మాజీ అధ్యక్షుడు కేవీ తంగబాలు, అధికార ప్రతినిధి కుష్బు, తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్, కేంద్ర మాజీ మంత్రులు టీఆర్ బాలు, పళని మాణిక్యం ఆసుపత్రి వద్దకు చేరుకుని కరుణానిధిని పరామర్శించారు. కరుణానిధిని పరామర్శించినానంతరం మీడియాతో డీఎంకే సంయుక్త ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ మాట్లాడుతూ, కరుణానిధి ఆరోగ్యంగానే ఉన్నారని, ఆహారం తీసుకుంటున్నారని వివరించారు. వైద్యుల సూచన మేరకే ఆయన డిశ్చార్జ్ అవుతారనీ, ఆయన నిర్ణయం మేరకు డిశ్చార్జ్ ఇక్కడ ఉండదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాస్త సీఎం జయలలిత డిశ్చార్జ్ విషయంగా అపోలో వర్గాల వ్యాఖ్యల్ని ఎద్దేవా చేస్తున్నట్టు ఉండడం గమనార్హం. ఇక, కనిమొళి మీడియాతో మాట్లాడుతూ అధినేతకు ఎలాంటి సమస్య లేదు అని, ఆయనకు సాధారణ చెకప్ మాత్రమేనని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని ప్రకటించారు.

Advertisement
Advertisement