మరో జన్మ ఉంటే వైశ్య కుటుంబంలో పుడతా | i would like born in vysaya family : kavitha | Sakshi
Sakshi News home page

మరో జన్మ ఉంటే వైశ్య కుటుంబంలో పుడతా

Jan 20 2014 2:28 AM | Updated on Apr 3 2019 9:11 PM

తాను వైశ్య కుటుంబంలో జన్మించడం తన అదృష్టమని, మరో జన్మంటూ ఉంటే వైశ్య కుటుంబంలోనే పుట్టేలా దేవున్ని కోరుకుంటానని ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి కవిత అన్నారు.

 కంప్లి, న్యూస్‌లైన్:
  తాను వైశ్య కుటుంబంలో జన్మించడం తన అదృష్టమని, మరో జన్మంటూ ఉంటే వైశ్య కుటుంబంలోనే పుట్టేలా దేవున్ని కోరుకుంటానని ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి కవిత అన్నారు. ఆమె ఆదివారం ఆర్యవైశ్య సమాజ 15వ రాష్ట్రస్థాయి ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎల్లరిగూ... నమస్కార అని కన్నడంలో ప్రసంగం ప్రారంభించగానే అక్కడున్న వారంతా హర్షధ్వానాలు చేశారు. అనంతరం తన ప్రసంగం తెలుగులో ప్రారంభించారు. సహోదరర సవాల్, కిలాడికిట్టు అనే కన్నడ చిత్రాలలో నటించడం ద్వారా కన్నడ ప్రజల్లో గుర్తింపు పొందానన్నారు. ఆర్యవైశ్యులు ఎక్కడ ఉన్నా వారి వారి సంప్రదాయాలు మరవకపోవడం గర్వకారణమన్నారు. ఇతర వర్గాలు అన్ని రంగాల్లో ఎలా రాణిస్తున్నారో అదే విధంగా ఆర్యవైశ్యులు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నారు. తమ సమాజం మోసపూరితులు కారని, ఒకరికొకరు అదుకునే దయాగుణం ఉన్నవారన్నారు. తమ సమాజం వారికి చేయూత ఇవ్వడం అందరూ నేర్చుకోవాలన్నారు.
 
  కుడిచేతితో ఇచ్చిన దానం ఎడమ చేతికి తెలియకుండా ఉండాలని సూచించారు. వరకట్నం నిషేధించడం తన ప్రధాన అభిప్రాయమని, ధనంతో లెక్కకట్టి కోడలునో, అల్లుడినో ఖరీదు చేయడం మంచిది కాదన్నారు. సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో తాను రాజకీయ ప్రవేశం చేశానన్నారు. ఈ సందర్భంగా ఆర్యైవైశ్య సమాజ ప్రజలు అమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నటుడు పసనూరు శ్రీనివాసులు, కర్ణాటక ఆర్యవైశ్య మహాజన ప్రధాన కార్యదర్శి గిరీష్ బెండకూరు, ఆంధ్ర ఆర్యవైశ్య యువజన సంఘాల సమైక్య అధ్యక్షులు విజయవాడ ఎం.ఆనంద్, రాష్ట్ర అధ్యక్షులు ఎస్.సంజీవప్ప, హనుమనాడు విభాగం మాజీ ఉపాధ్యక్షులు జీ.రాజారావ్, జీ.శ్రీనివాస్, కంప్లి వాసవి యువజన సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, డీవీ. సత్యనారాయణ, నారాయణాద్రి రైస్ ఇండస్ట్రీస్ ప్రముఖులు కేదారేశ్వరా వు, జీ.వెంకటేశ్వరావు పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement