breaking news
vysya family
-
అడుగడుగునా అరాచకమే!
అన్యాయం జరిగింది.. తమకు న్యాయం చేయండి మహాప్రభో అని వేడుకుంటే తిరిగి బాధితులనే భయభ్రాంతులకు గురిచేస్తారు. ఇంకా ప్రశ్నిస్తే కేసులు పెట్టించి జైలుకు పంపిస్తారు. నియోజకవర్గ ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధి మౌనం వహించడం, షాడో నేత అంతా తానై వ్యవహరించి అవినీతిపరులకు, అక్రమార్కులకు కొమ్ముకాయడం పరిపాటిగా మారింది. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితులు గోడపత్రికల రూపంలో ఆవేదన వెల్లగక్కుతున్నారు. సాక్షి, కాశీబుగ్గ/వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం): పలాస నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో అవినీతి అక్రమాలు పెచ్చుమీరాయి. ఏ మూలచూసినా.. ఏ నోట విన్నా ‘వెంకన్న’ లీలలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే శివాజీ మౌనం వహించడంతో సదరు షాడో నేత పరిపాలనకు కేంద్ర బిందువుగా మారారు. ఏ పని జరగాలన్నా ఆయన ఆమోదం ఉండాల్సిందే. ఎదిరిస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా కేసులు పెట్టించడం, జైలుకు పంపించడం, అధికారులతో దాడులు జరి పించడం వంటి కార్యకలాపాలకు పాల్పడతారని భయపడి కొందరు ఎక్కడికక్కడ ‘గోడపత్రికలు’ విడుదల చేసి తమ గోడు వినిపిస్తున్నారు. నువ్వలరేవులో వాల్పోస్టర్ల కలకలం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామంటూ జన్మభూమి కమిటీలు, టీడీపీ నాయకులు ప్రజల నుంచి వేల రూపాయల్లో కమీషన్లు దండుకుంటున్నారు. ప్రధానంగా నువ్వలరేవులో ఎంపీటీసీ సభ్యుడు, మరో ఎంపీటీసీ ప్రతినిధి, జన్మభూమి కమిటీ సభ్యుడు కలిసి సంక్షేమ పథకాల మంజూరు పేరిట వేలాది రూపాయలు దండుకుంటున్నారు. ఈ వాటాలలో కొంత ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కుపల్లి, మెట్టూరు గ్రామాల్లో జన్మభూమి కమిటీ సభ్యులు పథకానికి ఒక రేటు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. మరుగుదొడ్డి కావాలంటే రూ.1800, ఇంటి కోసం రూ.15వేలు–రూ.20 వేలు, చంద్రన్న బీమా అందించాలంటే రూ.20,000, పింఛన్ కావాలంటే రూ.1500 నుంచి రూ.3000.. ఇలా ఒక్కో పథకానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ‘పెద్ద’ల అండదండలు ఉండటం వల్లే ఇలా దర్జాగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి ఆగడాలను భరించలేక నువ్వలరేవులో కొందరు గోడ పత్రికను విడుదల చేసి నాయకులు బండారాన్ని బయటపెట్టారు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదంటూ ప్రజలు మండిపడుతున్నారు. బెదిరింపుల పర్వం.. పలాస ఎమ్మెల్యే అల్లుడు, రెండేళ్ల క్రితం పనిచేసిన కాశీబుగ్గ పోలీసు అధికారి, కొంతమంది సొంపేట పోలీసుల వల్ల తనకు ప్రాణభయం ఉందని, ఏం జరిగినా ఎమ్మెల్యే అల్లుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని పలాసకు చెందిన ఓ వైశ్య కుటుంబం పేరిట విడుదలైన గోడపత్రికలు అప్పట్లో కలకలం రేపాయి. సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్యే శివాజీ అల్లుడిపై విడుదలైన కరపత్రాలను సైతం ఇప్పటికీ మరవలేక పోతున్నారు. వైశ్యుల్లో ఆగ్రహావేశాలు.. బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన వైశ్య యువకుడు డోకి హరీష్ కాశీబుగ్గ ఓ మిఠాయి దుకాణంలో బతుకు తెరువుకోసం కూలిపనిచేసే వాడు. ఇతడిపై అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ దాడి చేసి మరణానికి కారకుడయ్యాడు. ఈ ఉదంతాన్ని కుల మత భేదాలు లేకుండా అందరూ ముక్తకంఠంతో ఖండించారు. గవర్నర్, ముఖ్యమంత్రి, కలెక్టర్, ఎస్పీల వరకు విషయాన్ని తీసుకెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ జంట పట్టణాలను స్తంభింపజేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని తెలుగుదేశం నుంచి సస్పెండ్ చేయించిన ఎమ్మెల్యే.. తిరిగి నెలరోజుల్లోనే బయటకు తీసుకువచ్చి ప్రస్తుతం ప్రచారంలో వెంటవేసుకుని తిరుగుతున్నారు. ఎలా మర్చిపోగలం.. తాజా ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు జంట పట్టణాల పరిధిలోని వైశ్య కుటుంబాలతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. అయితే వైశ్యులపై జరిగిన దాడులను గుర్తు చేసుకుని కొందరు సమావేశం మధ్యలోనే వెనక్కువచ్చేసినట్లు తెలిసింది. -
మరో జన్మ ఉంటే వైశ్య కుటుంబంలో పుడతా
కంప్లి, న్యూస్లైన్: తాను వైశ్య కుటుంబంలో జన్మించడం తన అదృష్టమని, మరో జన్మంటూ ఉంటే వైశ్య కుటుంబంలోనే పుట్టేలా దేవున్ని కోరుకుంటానని ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి కవిత అన్నారు. ఆమె ఆదివారం ఆర్యవైశ్య సమాజ 15వ రాష్ట్రస్థాయి ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎల్లరిగూ... నమస్కార అని కన్నడంలో ప్రసంగం ప్రారంభించగానే అక్కడున్న వారంతా హర్షధ్వానాలు చేశారు. అనంతరం తన ప్రసంగం తెలుగులో ప్రారంభించారు. సహోదరర సవాల్, కిలాడికిట్టు అనే కన్నడ చిత్రాలలో నటించడం ద్వారా కన్నడ ప్రజల్లో గుర్తింపు పొందానన్నారు. ఆర్యవైశ్యులు ఎక్కడ ఉన్నా వారి వారి సంప్రదాయాలు మరవకపోవడం గర్వకారణమన్నారు. ఇతర వర్గాలు అన్ని రంగాల్లో ఎలా రాణిస్తున్నారో అదే విధంగా ఆర్యవైశ్యులు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నారు. తమ సమాజం మోసపూరితులు కారని, ఒకరికొకరు అదుకునే దయాగుణం ఉన్నవారన్నారు. తమ సమాజం వారికి చేయూత ఇవ్వడం అందరూ నేర్చుకోవాలన్నారు. కుడిచేతితో ఇచ్చిన దానం ఎడమ చేతికి తెలియకుండా ఉండాలని సూచించారు. వరకట్నం నిషేధించడం తన ప్రధాన అభిప్రాయమని, ధనంతో లెక్కకట్టి కోడలునో, అల్లుడినో ఖరీదు చేయడం మంచిది కాదన్నారు. సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో తాను రాజకీయ ప్రవేశం చేశానన్నారు. ఈ సందర్భంగా ఆర్యైవైశ్య సమాజ ప్రజలు అమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నటుడు పసనూరు శ్రీనివాసులు, కర్ణాటక ఆర్యవైశ్య మహాజన ప్రధాన కార్యదర్శి గిరీష్ బెండకూరు, ఆంధ్ర ఆర్యవైశ్య యువజన సంఘాల సమైక్య అధ్యక్షులు విజయవాడ ఎం.ఆనంద్, రాష్ట్ర అధ్యక్షులు ఎస్.సంజీవప్ప, హనుమనాడు విభాగం మాజీ ఉపాధ్యక్షులు జీ.రాజారావ్, జీ.శ్రీనివాస్, కంప్లి వాసవి యువజన సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, డీవీ. సత్యనారాయణ, నారాయణాద్రి రైస్ ఇండస్ట్రీస్ ప్రముఖులు కేదారేశ్వరా వు, జీ.వెంకటేశ్వరావు పాల్గొన్నారు.