నాట్యపరిషత్‌కు ఐదెకరాలు : కేంద్ర హోం మంత్రి షిండే | five acres for natya parishat : sushil kumar shinde | Sakshi
Sakshi News home page

నాట్యపరిషత్‌కు ఐదెకరాలు : కేంద్ర హోం మంత్రి షిండే

Feb 1 2014 11:20 PM | Updated on Sep 2 2017 3:15 AM

నాట్య పరిషత్’ అభినయ సంకుల్ కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు.

 పండరీపూర్‌లో అఖిలభారత మరాఠీ నాట్య సమ్మేళనం ప్రారంభం
 
 షోలాపూర్, న్యూస్‌లైన్: నాట్య పరిషత్’ అభినయ సంకుల్ కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. పండరీపూర్‌లో జరిగిన 94వ అఖిల భారత మరాఠీ నాట్య సమ్మేళనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రాకుండా ఉన్నట్లయితే కళారంగంలో కొనసాగేవాడినని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. తాను చదువుకునే రోజుల్లో పలు నాటకాలలో పాల్గొనేవాడినని బాల్యస్మృతులను నెమరువేసుకున్నారు. అదేవిధంగా నాటక రంగంలో కృషిచేసిన పాతతరం కళాకారులను కొనియాడారు.
 
  ‘నాట్య పరిషత్’ అభినయ సంకుల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున గోరేగావ్‌లోని ఫిలింసిటీలో ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తామన్నారు. అలాగే ఇంతకు ముందు ప్రకటించిన రూ.ఐదు కోట్ల సహాయ నిధితోపాటు రూ.మూడున్నర కోట్లు, ఈ నాట్య సమ్మేళనం కోసం రూ.25 లక్షల నిధిని అందజేశామన్నారు. ప్రారంభోత్సవానికి ముందు ఉదయం ఏడు గంటలకు తిలక్ స్మారక్ మైదానం నుంచి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాకారుల విన్యాసాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. నాట్య సమ్మేళనం ప్రస్తుత అధ్యక్షుడు అరుణ్ కాకుడే, మాజీ అధ్యక్షుడు మోహన్ అగాశే, నాట్యపరిషత్ అధ్యక్షుడు మోహన్ జోషి, రాష్ట్ర సంస్కృతిక శాఖ మంత్రి సంజయ్ దేవతాళే, సహకార శాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్, ఆర్పీఐ నాయకుడు రాందాస్ అథవాలే, సమ్మేళనం స్వాగతాధ్యక్షుడు, ఎమ్మెల్యే భారత్ బాల్కే, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement