ఐదో విధానసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కోటి మందికి పైగా ఓటర్లు విధానసభ ఎన్నికలలో పోటీపడ్తోన్న 810 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని తేల్చనున్నారు.
ఢిల్లీలో.. నేడే పోలింగ్
Dec 3 2013 11:11 PM | Updated on Sep 2 2017 1:13 AM
సాక్షి, న్యూఢిల్లీ: ఐదో విధానసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కోటి మందికి పైగా ఓటర్లు విధానసభ ఎన్నికలలో పోటీపడ్తోన్న 810 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని తేల్చనున్నారు. అభ్యర్థుల జాబితాలో ఉన్నవారెవరికీ ఓటు వేయకూడదనుకునేవారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్పైనున్న ఆఖరి బటన్ నోటా (నన్ ఆఫ్ ది ఎబౌ- పైవారిలో ఎవరూ కాదు) నొక్కే అవకాశం ఢిల్లీ ఓటర్లకు బుధవారం తొలిసారిగా అందుబాటులోకి రానుంది. ఓటింగ్ కోసం నగరంలో 11వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. 630 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా వ్యవస్థతో పాటు అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన్ 45 పోలింగ్ కేంద్రాలను ఆదర్శ కేంద్రాలుగా గుర్తించింది. ఈ పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు ఓటు వేయడం కోసం పొడవాటి క్యూలలో నిల్చోవాల్సిన అవసరం లేదు.
ఓటు వేయడానికి వచ్చేవారికి టోకెన్లు ఇస్తారు. ఈ ఆదర్శ పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు ఉంటాయి. తాగునీరు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స ఓటర్లకు అందుబాటులో ఉంటాయి.ఓటర్లకు సహాయపడడం కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ ఓటరు గుర్తింపు కార్డులేనివారు పాస్పోర్టు లేదా డ్రైవింగ్ లెసెన్స్ లేదా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ/ప్రభుత్వ రంగసంస్థ ఉద్యోగి ఫొటో గుర్తింపుకార్డు, ఫొటోతో కూడిన బ్యాంకు లేదా పోస్టాఫీసు పాస్బుక్, ప్యాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎంఎన్ఆర్జీఏకార్డు, కార్మిక మంత్రిత్వశాఖ ఆరోగ్య పథకం స్మార్ట్ కార్డు, ఫొటోతో కూడిన పింఛను డాక్యుమెంట్ను చూపి తమ ఉనికిని నిరూపించుకుని ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
ఢిల్లీలో అధికారం చేజిక్కించుకోవడానికి మూడు పార్టీల మధ్య జరుగుతోన్న పోరులో ఓటింగ్ శాతం కీలక పాత్ర పోషించనుంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ విధానసభ ఎన్నిక లలో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడంతో ఢిల్లీలోనూ అదే ధోరణి కొనసాగవచ్చని ఎన్నికల అధికారులు ఆశిస్తున్నారు. ఢిల్లీలో ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం నగర ఎన్నికల కార్యాలయం అనేక జాగరూకత కార్యక్రమాలను నిర్వహించింది. ప్రభుత్వేతర సంస్థల సహాయంతో జాగరూకత కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు సినీతారలు, టీవీ నటులు, ఇతర సెలబ్రిటీలతో ఓటు హక్కు ఆవశ్యకతను నగర ఓటర్లకు వివరించేందుకు కృషిచేసింది. యువ ఓటర్లను నమోదుచేయడానికి, ఓటరు జాబితాలోని బూటకపు పేర్లను తొలగించడానికి కూడా ఎన్నికల కమిషన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.
విధానసభ ఎన్నికలలో గెలుపు తమదే అని అధికారం కోసం పోటీపడ్తోన్న మూడు పార్టీలు చెబుతున్నప్పటికీ నిజంగా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది హేమాహేమీలైన రాజకీయ పండితులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల బరిలో ప్రవేశించడం వల్ల ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయని అంటున్నారు. ఎన్నికల ఫలితాలను ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే సీట్లు నిర్దేశిస్తాయని వారు అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో కుమ్మక్కయిందని బీజేపీ విమర్శిస్తున్నప్పటికీ ఆ పార్టీ వల్ల అధిక నష్టం కాంగ్రెస్కే వాటిల్లనుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం వల్ల రాజకీయ వాతావరణం ఆ పార్టీకి పూర్తి అనుకూలంగా మారకపోయినా కాంగ్రెస్కు వ్యతిరేకంగా మారిందని వారు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దిగడం బీజేపీకి లాభిస్తుందని మరికొందరు అంచనావేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్కు, అససమ్మతి రాజకీయాలు బీజేపీకి ప్రతికూలాంశాలుగా ఉన్నాయి.
సిటింగ్ ఎమ్మెల్యేల సీట్లపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నప్పటికీ వారిలో పలువురి విజయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గెలుస్తారనే ఆశతో ఇటీవల పార్టీలోకి చేర్చుకుని టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేల గెలుపు కూడా సందేహాస్పదంగా మారింది. ఆప్ ఎన్నికల బరిలోకి దిగడం వల్ల 2008 అసెంబ్లీ ఎన్నికలలో సునాయాసంగా గెలిచిన పలువురు నేతల విజయావకాశాలు ఈ ఎన్నికలలో ప్రశ్నార్థకంగా మారాయి. 1993 నుంచి వరుసగా విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్, బీజేపీ శాసనసభ్యులు కూడా తమ గెలుపు కోసం ప్రత్యేకంగా శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ నుంచి
గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
బీజేపీ కూడా వారు పోటీపడ్తోన్న న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి విజేందర్ ఉగప్తాను బరిలోకి దింపి ఎన్నికను ముక్కోణపు పోటీగా మార్చివేసింది. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడ్తోన్న ముగ్గురు నేతలలో డాక్టర్ హర్షవర్ధన్ గెలుపు తథ్యంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలలో ఆప్ ఆయనకు వ్యతిరేకంగా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపలేదు. కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థి వీకే మోంగా ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీనితో ఈ నియోజకవర్గం నుంచి హర్షవర్ధన్ గెలుపు నల్లేరుపై నడకగా మారనుంది. అందుకే ఆయన తన నియోజకవర్గ ప్రచార బాధ్యతను కార్యకర్తలపైనా, తన భార్యపైనా పెట్టి మిగతా నియోజకవర్గాలలో ప్రచారంపై దృష్టిసారించారు.
కానీ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి అర్వింద్ కేజ్రీవాల్, ముఖ్యమంత్రి షీలాదీక్షిత్లకు ఈ సౌలభ్యం కరువైంది. వారు తమ పార్టీ అభ్యర్థుల కోసమేకాక తమ కోసం కూడా ప్రచారం చేసుకోవలసివచ్చింది. మంత్రుల విషయానికి వస్తే 2008 అసెంబ్లీ ఎన్నికలలో గాంధీనగర్ నుంచి అత్యధికంగా 32 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన అర్విందర్ సింగ్ లవ్లీ కూడా ఈసారి తన ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సివచ్చింది. మంగోల్పురిలో రాజ్కుమార్ చౌహాన్, లక్ష్మీనగర్లో ఏకే వాలియా, బల్లీమారన్లో హరూన్ యూసఫ్, మాలవీయనగర్లో కిరణ్వాలియా, రాజేందర్నగర్లో రమాకాంత్ గోస్వామి కూడా ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు.
Advertisement
Advertisement