కాంట్రాక్టర్ల మధ్య ఘర్షణ


తిరువళ్లూరు, న్యూస్‌లైన్: జిల్లాలోని అండర్సన్ పేట గ్రామంలో కాంట్రాక్టర్ల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. తిరువళ్లూరు జిల్లా అండర్సన్‌పేట గ్రామంలో కృష్ణాస్వీట్స్ తయారీ కేంద్రం ఉంది. ఇక్కడి నుంచి పలు షాపులకు స్వీట్లు సరఫరా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కృష్ణా స్వీట్స్ కంపెనీ దీపావళి, సరస్వతి పూజకు పెద్ద ఎత్తున స్వీట్లు తయారు చేయాలని నిర్ణయించింది. 

 

 ఈ మేరకు కాంట్రాక్ట్ పద్ధతిలో నెల రోజుల వరకు 200 మంది మహిళలను ఉద్యోగులుగా నియమించేందుకు కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది. అదే ప్రాంతానికి చెందిన రామచంద్రన్, ప్రేమ్‌నాథ్ టెండర్ దాఖలు చేశారు. వీరిలో రామచంద్రన్‌కు కాంట్రాక్ట్ దక్కింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం రామచంద్రన్ అనుచరులు విధుల్లో ఉండగా ప్రేమ్‌నాథ్ అనుచరులు వారిపై దాడులకు దిగారు. 

 

 ఈ సంఘటనలో రామచంద్రన్ (32), మహేష్ (34), మహేంద్రన్ (38), విమల్‌రాజ్(34), కార్తీక్ (33) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. ఇరు వర్గాలు కర్రలతో దాడులకు దిగడంతో అండర్సన్‌పేటలో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top