రీలే కాదు.. రియల్ హీరోలు కూడా.. | Sakshi
Sakshi News home page

రీలే కాదు.. రియల్ హీరోలు కూడా..

Published Sun, Dec 6 2015 3:08 PM

Chenai actors to help floods victims

సాక్షి, చెన్నై: వరద బాధితులను ఆదుకోవడానికి ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలను ప్రకటించిన తమిళ నటీనటులు శనివారం స్వయంగా సహాయకార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమిళ నటులు విశాల్, ధనుష్, కార్తీ, సిద్ధార్థ్, కోవై సరళ, ఖుష్బూ తదితరులు వివిధ ప్రాంతాల్లో సహాయకార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాధితులకు తమ తరఫున ఆహార పొట్లాలను, మంచి నీటి పాకెట్లను అందించారు.

హీరో విశాల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలకు వెళ్లి కొంతమంది బాధితులకు ఆహారాన్ని అందించారు. బాధితులతో మమేకం అయ్యి వారి కష్టనష్టాలను తెలుసుకున్నాడు. కార్తీ కూడా సహాయ కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యాడు. నటీమణులు ఖుష్బూ, కోవై సరళలు తమ వంతుగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 
హీరో సిద్ధార్థ్ ఒక టీమ్‌నే తయారు చేసుకుని వరద బాధితులకు అండగా నిలుస్తున్నాడు. ట్వీటర్ ద్వారా వలంటీర్లతో అనుసంధానమై పనిచేస్తున్నాడు. వీలైన వారు ఆహార పొట్లాలను, నీళ్ల బాటిళ్లను తెచ్చి బిగ్ ఎఫ్‌ఎమ్ ఆఫీసులో అందజేయాలని, అక్కడి వరకూ రాలేని వాళ్లు ట్వీటర్ ద్వారా సమాచారం అందిస్తే తమ వాళ్లే వాహనాల్లో వచ్చి వాటిని సేకరిస్తారని సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు.
 
‘మా’ 5 లక్షల  విరాళం:
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు చెన్నై తల్లి లాంటిది. అలాంటి చెన్నై నగర ప్రజల పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఇప్పటికే మా బిడ్డల్లాంటి హీరోలు స్పందించి తమకు తోచిన సాయాన్ని ప్రక టించారు. అందుకే ‘మా’ అసోసి యేషన్ తరపున కూడా రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటిస్తున్నాం’’ అని రాజేంద్రప్రసాద్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.

Advertisement
Advertisement