‘చర్చిగేట్‌ బాంబు బెదిరింపు’ నిందితుడి పట్టివేత | Bomb scare at Churchgate station, accused arrested | Sakshi
Sakshi News home page

‘చర్చిగేట్‌ బాంబు బెదిరింపు’ నిందితుడి పట్టివేత

Jul 30 2017 9:37 PM | Updated on Sep 5 2017 5:13 PM

నగరంలో రద్దీ రైల్వే స్టేషన్‌లలో ఒకటైన చర్చిగేట్‌ను బాంబులతో పేలుస్తామని బెదిరింపు ఫోన్‌ చేసిన ఆగంతకున్ని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు

సాక్షి, ముంబై: నగరంలో రద్దీ రైల్వే స్టేషన్‌లలో ఒకటైన చర్చిగేట్‌ను బాంబులతో పేలుస్తామని బెదిరింపు ఫోన్‌ చేసిన ఆగంతకున్ని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితున్ని బాబు ఖేంచంద్‌ చౌహాన్‌ (55)గా గుర్తించారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం..ఈ నెల 13వ తేదీన ఉదయం 10.44 నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి రైల్వే హెల్ప్‌ లైన్‌ 182 నంబరు ఫోన్‌ వచ్చింది. చర్చిగేట్‌ రైల్వే స్టేషన్‌ను బాంబులతో పేల్చివేస్తామని చెప్పడంతో వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు.

రంగంలోకి దిగిన పోలీసులు జాగీలాలతో, బాంబు స్కాడ్‌తో చర్చిగేట్‌లో ఉన్న ప్లాట్‌ఫారాలు, టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు, కార్యాలయాలు, పరిసరాలు అణవణువు గాలించారు. కానీ ఎక్కడ బాంబు దొరక్కపోవడంతో ఫేక్‌ కాల్‌గా భావించిన పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ గాలింపు పూర్తయిన తరువాత గుర్తు తెలియని వ్యక్తికి వ్యతిరేకంగా పోలీసులు కేసు నమోదు చేశారు.  ఆ బెదిరింపు ఫోన్‌ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీయడం ప్రారంభించారు.

ఆ ఫోన్‌ మాహింలోని ఓ పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 10.44 గంటలకు పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌ నుంచి ఎవరెవరు ఫోన్‌ చేశారో సీసీ టీవీ కెమరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. అందులో బాబు చౌహాన్‌ ఒక్కడే ఆ సమయంలో ఫోన్‌ చేసినట్లు గుర్తించారు. ఎట్టకేలకు 20 రోజుల తరువాత అతన్ని వలపన్ని పట్టుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఆ రోజు ఫోన్‌ చేసిన విషయాన్ని అంగీకరించాడు.  ఆహ్మదాబాద్‌కు చెందిన బాబు కూలి పని కోసం కొద్ది నెలల కిందట ముంబై వచ్చాడు. దొరికిన పనిచేసుకుంటూ పుట్‌పాత్‌పై నిద్రపోయేవాడని పోలీసులు తెలిపారు. నిందితున్ని కోర్టులో హాజరు పర్చగా జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.

Advertisement
 
Advertisement
Advertisement