బళ్లారి సహా గుల్బర్గ, శివమొగ్గల్లో విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బళ్లారి సహా గుల్బర్గ, శివమొగ్గల్లో విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. గుల్బర్గలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పనులను వేగవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచిస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విమానాశ్రయాల నిర్మాణ పనులను ఆపబోమని భరోసా ఇచ్చారు.
గుల్బర్గలో మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అక్రమ మైనింగ్ ఆరోపణలు వచ్చినందున ప్రాథమిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి సంతోష్ లాడ్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్న బీజేపీ డిమాండ్ను ఆయన తోసిపుచ్చారు. ఆయన తప్పే చేయలేదని స్పష్టం చేశారు. వర్షా కాలం తర్వాత దెబ్బ తిన్న రోడ్లు, వంతెనలను మరమ్మతు చేయిస్తామని తెలిపారు. కొత్త తాలూకాల ఏర్పాటుపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉందని ఆయన చెప్పారు.