
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనంతపురం యువభేరిలో పాల్గొనడానికి జిల్లాకు వచ్చిన జననేతకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. కొడికొండ చెక్ పోస్ట్ వద్ద ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
రాప్తాడు ఇంచార్జ్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో సీకే పల్లి నుంచి యువత భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అభిమాన జనసందోహం నడుమ వైఎస్ జగన్ యువభేరి ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయనకు అక్కడకు రాగానే జై జగన్ నినాదాలతో ఎంవైఆర్ కళ్యాణ మండపం మార్మోగింది. సభా వేదికపై దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి జగన్ నివాళులర్పించారు. వేదికపై ఉన్న ప్రొఫెసర్లు, మేధావులను ఆయన పరిచయం చేసుకున్నారు.
మరోవైపు యువభేరికి యువత పెద్ద ఎత్తున కదిలివచ్చింది. భారీగా తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, హోదా కోసం మూడున్నరేళ్లుగా రాజీలేని పోరాటం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.