ప్రపంచకప్‌లో సందడి చేస్తున్న యాంకర్లు వీరే

World Cup 2019 Five female Anchors Who Stand Out In The Matches - Sakshi

హైదరాబాద్‌:  టెలివిజన్‌ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది వ్యాఖ్యాతే(యాంకర్‌). కార్యక్రమం చూసే ప్రేక్షకుల దృష్టి ముందుగా వచ్చే యాంకర్‌పైనే ఉంటుంది. కొందరు మాటలు, పంచ్‌లతో ఆకట్టుకుంటే.. మరికొందరు తమ అందంతో ఆకర్షిస్తారు. అలా అందంతో మాటలతో క్రికెట్‌ అభిమానులను కట్టిపడేస్తున్నారు ప్రపంచకప్‌ యాంకర్లు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్‌ ప్రపంచకప్‌లో ఐదుగురు యాంకర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి వివరాలు ఏంటో తెలుసుకుందాం..


మయంతి లాంగర్
క్రికెట్‌, ఫుట్‌బాల్‌ అభిమానులకు తెగ నచ్చిన మోస్ట్ ఫేవరేబుల్ యాంకర్‌ మయంతి లాంగర్‌. 1985 ఫిబ్రవరి 8న ఢిల్లీలో జన్మించిన మయంతి స్థానిక హిందూ కాలేజీలో గ్యాడ్యూయేషన్‌ పూర్తి చేసింది. కాలేజీలో నిర్వహించే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించేది. దీంతో పీజీ చేస్తుండగానే జీ స్పోర్ట్స్‌లో యాంకర్‌గా అవకాశం వచ్చింది.  తన పెర్ ఫార్మెన్స్ చాలా మందికి నచ్చడంతో ఆమె కెరీర్‌ తారా జువ్వలా దూసుకుపోయింది. 

2010లో ఫిఫా ప్రపంచకప్‌కి తొలిసారి వాఖ్యాతగా వ్యవహరించింది. అక్కడ విజయవంతం కావడంతో 2010లో ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్‌ క్రీడలకు టీవీ ప్రెజెంటర్‌గా చేసింది. ఇక అప్పటినుంచి ఐపీఎల్‌, ప్రపంచకప్‌లకు వ్యాఖ్యాతగా కొనసాగుతోంది. ఐపీఎల్‌లో బెస్ట్‌ యాంకర్‌గా తనదైన ముద్ర వేసుకుంది. మ్యాచ్‌కు ముందు జరిగే విశ్లేషణలను చాలా మంది మయంతి కోసమే చూస్తారంటే అతిశయోక్తి కాదు. 2013లో క్రికెటర్‌ స్టువార్ట్‌ బిన్నిని వివాహం చేసుకుంది. ఈ మధ్య ఎక్కువగా అమె వస్త్రధారణతో ట్రోలింగ్స్‌కు గురవతున్నారు. అయితే అవేమి పట్టించుకోకుండా మంచి వ్యాఖ్యాతగా రాణిస్తుంది. ప్రపంచకప్‌లో ప్రధాన యాంకర్‌గా వ్యవహిరస్తోంది.


సంజన గణేశన్
పుణెకు చెందిన సంజన గణేశన్‌ అనతికాలంలోనే టీవీ ప్రెజెంటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంజనీరింగ్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించిన సంజన గణేశన్‌కు మోడలింగ్‌పై అమితాసక్తి ఉండేది. దీంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేసి మోడిలింగ్‌ వైపు అడుగులు వేసింది. 2014లో మిస్‌ ఇండియా ఫైనలిస్టుగా నిలిచిన గణేశన్‌.. అనంతరం వ్యాఖ్యాతగా మారారు. స్టార్‌లో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో టీమిండియా మ్యాచ్‌లకు సంబంధించిన సమాచారాన్ని క్రికెట్‌ అభిమానులతో పంచుకోనుంది. 


రిధిమ పాఠక్
టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ఇంటర్వ్యూతో వార్తల్లో నిలిచింది రిధిమ పాఠక్‌. చెన్నైలో పుట్టినప్పటికీ ఎడ్యుకేషన్‌ మొత్తం పుణెలో కొనసాగింది. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన రిధిమ మోడలింగ్‌పై ఆసక్తి ఉండటంతో 2012లో మోడల్‌గా అనంతరం వ్యాఖ్యాతగా మారారు. క్రికెట్‌ కంటే ముందు బాస్కెట్‌ బాల్‌ పోటీలకు యాంకరింగ్‌ చేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారు‌. ప్రొఫెషనల్‌ వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌. అభిజీత్‌ చౌదరీ దర్శకత్వంలో సినిమా హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం ప్రపంచకప్‌లో భారత్‌ మ్యాచ్‌లకు సంబంధించిన సమాచారాన్ని క్రికెట్‌ అభిమానులతో పంచుకోనుంది. 

పేయ జన్నతుల్
2007లో మిస్‌ బంగ్లాదేశ్‌గా ఎన్నికైన ఈ భామ అనతికాలంలోనే ఎన్నో పేరుప్రఖ్యాతలను సంపాదించుకుంది. 2008 నుంచి పూర్తిగా మోడలింగ్‌ రంగానికే పరిమితమై పలు సినిమాల్లో నటించింది. అంతేకాకుండా 2013లో మిస్‌ ఇండియా ప్రిన్సెస్‌ ఇంటర్నేషనల్‌ అవార్డును కైవసం చేసుకుంది. అనంతరం యాంకరింగ్‌గా మారిన జన్నతుల్‌.. కొద్దికాలంలోనే స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. బంగ్లాదేశ్‌ టీ20 లీగ్‌కు వ్యాఖ్యాతగా పనిచేసింది. ఇక బంగ్లా క్రికెటర్లతో కలిసి ఎన్నో ప్రకటనల్లో నటించింది. బంగ్లాదేశ్‌లోని గాజీ టీవీలో ప్రపంచకప్‌ అప్ డేట్స్ ఇవ్వనుంది.


జైనబ్ అబ్బాస్
పాకిస్తాన్‌లో పాపులర్‌ స్పోర్ట్స్‌ స్టార్‌ జైనబ్‌ అబ్బాస్‌. సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటుంది. ఈ మధ్యే పాక్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ ఆగ్రహానికి గురైంది. పాకిస్తాన్‌ టీ20 లీగ్‌కు వ్యాఖ్యాతగా పనిచేసి క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అలరించింది. ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ మ్యాచ్‌లకు సంబంధించిన సమాచారాన్ని క్రికెట్‌ అభిమానులకు అందిస్తుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top