రాహుల్‌... జిగేల్‌ 

Titans crush Pirates 53-32   - Sakshi

తెలుగు టైటాన్స్‌ విజయం  

పట్నా: స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ నాలుగో విజయం సాధించింది. జోన్‌ ‘బి’లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 53–32తో డిఫెండింగ్‌ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. రైడింగ్‌లో రాహుల్‌  17, నీలేశ్‌ 7 పాయింట్లతో సత్తా చాటడంతో పాటు ట్యాక్లింగ్‌లో విశాల్‌ (9 పాయింట్లు) రాణించడంతో టైటాన్స్‌ సునాయాసంగా గెలుపొందింది.  11వ నిమిషంలో 8–9తో వెనుకబడి ఉన్న టైటాన్స్‌... నీలేశ్‌ ‘సూపర్‌రైడ్‌’తో 3 పాయింట్లు సాధించడంతో 11–9తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా చెలరేగి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. పట్నా తరఫున వికాస్‌ 9 రైడ్‌ పాయింట్లు సాధించగా... ‘డుబ్కీ’ కింగ్‌ ప్రదీప్‌ (4 పాయింట్లు) విఫలమయ్యాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ 37–27తో పుణేరీ పల్టన్స్‌పై నెగ్గింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్‌ ఢిల్లీతో పుణేరీ పల్టన్, పట్నా పైరేట్స్‌తో బెంగళూరు బుల్స్‌ తలపడనున్నాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top