క్వార్టర్స్‌లో శ్రీకృష్ణప్రియ, గురుసాయిదత్‌  | Sri Krishna Priya, Guru Sai Dutt in Quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో శ్రీకృష్ణప్రియ, గురుసాయిదత్‌ 

Sep 7 2018 12:49 AM | Updated on Sep 7 2018 12:49 AM

Sri Krishna Priya, Guru Sai Dutt in Quarters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) టూర్‌ సూపర్‌–100 హైదరాబాద్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్లు కుదరవల్లి శ్రీకృష్ణప్రియ, గురుసాయిదత్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో టాప్‌సీడ్‌ సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా జోడీ కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండోరౌండ్‌లో ఐదో సీడ్‌ శ్రీకృష్ణ ప్రియ 21–15, 21–18తో నున్‌టకర్న్‌ ఎమ్‌సార్డ్‌ (థాయ్‌లాండ్‌)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో రసిక రాజే (భారత్‌) 21–19, 21–16తో చెంగ్‌ యింగ్‌ మయ్‌ (హాంకాంగ్‌)ను ఓడించి క్వార్టర్స్‌కు చేరుకుంది. పురుషుల విభాగంలో సమీర్‌ వర్మ, ప్రతుల్‌ జోషి, గురుసాయిదత్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్‌ మూడోరౌండ్‌ మ్యాచ్‌ల్లో టాప్‌ సీడ్‌ సమీర్‌వర్మ (భారత్‌) 21–14, 21–9తో కెవిన్‌ అరోకియా వాల్టేర్‌ (భారత్‌)పై, గురుసాయిదత్‌ 21–14, 21–13తో డేనియల్‌ ఫరీద్‌ (భారత్‌)పై గెలుపొందగా... ఐదోసీడ్‌ సౌరభ్‌ వర్మ 21–14, 13–21, 19–21తో ప్రతుల్‌ జోషి చేతిలో పోరాడి ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో చిరాగ్‌ సేన్‌ 16–21, 18–21తో అబ్దుల్‌ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు.
 
డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ప్లేయర్లు సాత్విక్‌ సాయిరాజ్, సిక్కిరెడ్డి తమ భాగస్వాములతో కలిసి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా ద్వయం 21–10, 22–20తో యెంగ్‌ షింగ్‌ చోయ్‌– ఫాన్‌ కా యాన్‌ (హాంకాంగ్‌) జోడీపై నెగ్గి క్వార్టర్స్‌ చేరుకుంది. పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్‌లో టాప్‌సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం 21–13, 21–17తో బగాస్‌ మౌలానా–ప్రెంకీ విజయ పుత్ర (ఇండోనేసియా) జోడీపై, కోన తరుణ్‌ (భారత్‌)–లిమ్‌ ఖిమ్‌ వా (మలేసియా) జంట 21–23, 24–22, 22–20తో సుపక్‌ జోమ్‌కో–వచిరవిట్‌ సోథాన్‌ (థాయ్‌లాండ్‌) జోడీలపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. ఇతర మ్యాచ్‌ల్లో గారగ కృష్ణ ప్రసాద్‌–ధ్రువ్‌ కపిల జంట 16–21, 18–21తో నాలుగో సీడ్‌ అరుణ్‌ జార్జ్‌–సన్యం శుక్లా జోడీ చేతిలో, విష్ణువర్ధన్‌ గౌడ్‌–పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్‌ జంట 10–21, 15–21తో అక్బర్‌ బింటాంగ్‌–మోహ్‌ రిజా పహ్‌లెవి (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలయ్యాయి. మహిళల డబుల్స్‌ విభాగంలో జక్కంపూడి మేఘన–పూర్విషా రామ్‌ జంట 21–17, 21–9తో కావ్య గుప్తా–ఖుషి గుప్తా జోడీపై నెగ్గి రెండోరౌండ్‌లో అడుగుపెట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement