
శ్రీలంక విజయలక్ష్యం 300
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇక్కడ శనివారం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 300 లక్ష్యాన్ని నిర్దేశించింది.
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇక్కడ శనివారం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 300 లక్ష్యాన్ని నిర్దేశించింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్(103) సెంచరీతో ఆకట్టుకోగా, డు ప్లెసిస్ (75)హాఫ్ సెంచరీతో మెరిశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను ఆమ్లా-డీకాక్ లు ఆరంభించారు. అయితే డీకాక్(23) తొలి వికెట్ గా అవుటై నిరాశపరిచాడు. అనంతరం ఆమ్లాతో జతకలిసిన డు ప్లెసిస్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. వీరిద్దరూ ఎటువంటి తడబాటుకు లోనుకాకుండా దక్షిణాఫ్రికా స్కోరు బోర్దును ముందుకు తీసుకెళ్లారు.
ఈ జోడి రెండో వికెట్ కు 145 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి దక్షిణాఫ్రికాను పటిష్ట స్ధితికి చేర్చింది. అయితే డు ప్లెసిస్ అవుటైన తరువాత దక్షిణాఫ్రికా గాడితప్పినట్లు కనబడింది. స్వల్ప విరామాల్లో డివిలియర్స్(4), మిల్లర్(18)లు నిష్క్రమించడంతో దక్షిణాఫ్రికా స్కోరు నెమ్మదించింది. కాగా, చివర్లో డుమిని(38 నాటౌట్;20బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్స్), క్రిస్ మోరిస్(20;19 బంతుల్లో 3 ఫోర్లు)లు బ్యాట్ ఝుళిపించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో నువాన్ ప్రదీప్ రెండు వికెట్లు సాధించగా,ప్రసన్న,లక్మాల్లు తలో వికెట్ తీశారు.