
విజేత షణ్ముఖ తేజ
కేసీఎం ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో తెలుగు కుర్రాడు షణ్ముఖ తేజ మెరిశాడు.
సాక్షి, హైదరాబాద్: కేసీఎం ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో తెలుగు కుర్రాడు షణ్ముఖ తేజ మెరిశాడు. కోయంబత్తూరులో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన చివరి రౌండ్ గేమ్లో షణ్ముఖ తేజ (8.5)... వైశాఖ్ (8)తో జరిగిన గేమ్ను ‘డ్రా’ చేసుకొని చాంపియన్గా నిలిచాడు.
అంతకుముందు జరిగిన ఎనిమిది గేముల్లోనూ అతను వరుస విజయాలు సాధించాడు. తొలి గేమ్లో మణిని ఓడించిన తేజ... వరుసగా తిరువేంగడమ్, వరదరాజన్, ప్రశాంత్, సుభాశ్ ఆనంద్, రఘుల్, ఆండ్రూ వేద వాట్సన్ సోలోమన్, కిషోర్ దేవ్లపై గెలిచాడు.