మళ్లీ నిరాశ

Saina Nehwal loses in Indonesia Masters final - Sakshi

తై జు యింగ్‌ చేతిలో సైనా వరుసగా ఏడో ఓటమి

ఇండోనేసియా ఓపెన్‌లో రన్నరప్‌తో సంతృప్తి

జకార్తా: కొత్త సీజన్‌ను టైటిల్‌తో ప్రారంభించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. ఇండోనేసియా మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్‌ అమ్మాయి రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ సైనా 9–21, 13–21తో ఓడిపోయింది. కేవలం 27 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా తన ప్రత్యర్థికి ఏదశలోనూ పోటీనివ్వలేకపోయింది. రెండు గేముల్లోనూ ఆరంభం నుంచే తై జు యింగ్‌ జోరు కొనసాగింది. సైనాపై తై జు యింగ్‌కిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. తై జు యింగ్‌పై సైనా చివరిసారి 2013 స్విస్‌ ఓపెన్‌లో గెలుపొందడం గమనార్హం. విజేతగా నిలిచిన తై జు యింగ్‌కు 26,250 డాలర్లు (రూ. 16 లక్షల 69 వేలు)... రన్నరప్‌ సైనాకు 13,300 డాలర్లు (రూ. 8 లక్షల 45 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top