ఎ డివిజన్ మూడు రోజుల లీగ్లో గౌడ్స్ ఎలెవన్ , ఎవర్గ్రీన్ జట్ల మధ్య మ్యాచ్ డ్రా గా ముగిసింది.
సాక్షి, హైదరాబాద్: ఎ డివిజన్ మూడు రోజుల లీగ్లో గౌడ్స్ ఎలెవన్ , ఎవర్గ్రీన్ జట్ల మధ్య మ్యాచ్ డ్రా గా ముగిసింది. చివరి రోజు ఆటలో గౌడ్స్ బ్యాట్స్మన్ రోహిత్ శ్రీనివాస్ (157 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు 80.4 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. రోహిత్తో పాటు రేవంత్ సాయి (61) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఎవర్గ్రీన్ బౌలర్లలో అజ్మత్ ఖాన్, రోహన్ యాదవ్ చెరో మూడు వికెట్లతో రాణించారు.
అనంతరం మ్యాచ్ ముగిసే సమయానికి ఎవర్గ్రీన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ల్లో గౌడ్స్ ఎలెవన్ 287/9, ఎవర్ గ్రీన్ 225 పరుగులు చేశాయి. మిగతా మ్యాచ్ల్లో ఏఓసీ ఇన్నింగ్స్ 199 పరుగుల తేడాతో జెమినీ ఫ్రెండ్స్పై గెలుపొందగా, కాంటినెంటల్, గుజరాతీ మ్యాచ్ డ్రా అయ్యింది.
ఇతర మ్యాచ్ల ఫలితాలు
కాంటినెంటల్: తొలి ఇన్నింగ్స్ 236, రెండో ఇన్నింగ్స్ 198/9 డిక్లేర్డ్ (సంతోష్ 39, సంహిత రెడ్డి 37, సందీప్ మనోహర్ 41, యశ్వంత్ రెడ్డి 47; కమల్ చౌదరీ 3/55), గుజరాతీ: తొలి ఇన్నింగ్స్ 220, రెండో ఇన్నింగ్స్: 215/9 (రోహిత్ రెడ్డి 96, ఆదిత్య 38; లలిత్ మోహన్ 5/89).
ఏఓసీ: తొలి ఇన్నింగ్స్ 481/9; జెమినీ ఫ్రెండ్స్: తొలి ఇన్నింగ్స్ 99, ఫాలో ఆన్: 183 (అభిరత్ రెడ్డి 43, రాధకృష్ణ 48).