తెలుగు టైటాన్స్‌కు ఐదో స్థానం | Pro Kabaddi League: U Mumba outclass Jaipur Panthers to enter semis | Sakshi
Sakshi News home page

తెలుగు టైటాన్స్‌కు ఐదో స్థానం

Mar 1 2016 11:56 PM | Updated on Sep 3 2017 6:46 PM

తెలుగు టైటాన్స్‌కు ఐదో స్థానం

తెలుగు టైటాన్స్‌కు ఐదో స్థానం

గతేడాది మూడో స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్ జట్టు ఈసారి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.

* చివరి మ్యాచ్‌లో యు ముంబా చేతిలో ఓటమి
* ప్రొ కబడ్డీ లీగ్ సెమీస్‌లో బెంగాల్, పుణేరి


ముంబై: గతేడాది మూడో స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్ జట్టు ఈసారి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-3లో తమ పోరాటాన్ని పరాజయంతో ముగించింది. డిఫెండింగ్ చాంపియన్ యు ముంబాతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 22-38 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో టైటాన్స్ జట్టు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి 38 పాయింట్లతో ఐదో స్థానంతో సంతృప్తి పడింది.

టైటాన్స్ ఓటమితో మరోవైపు బెంగాల్ వారియర్స్, పుణేరి పల్టన్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఇప్పటికే పట్నా పైరేట్స్, యు ముంబా జట్లు కూడా సెమీస్‌కు చేరాయి. ముంబాతో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ జట్టు మరోసారి నిరాశపరిచింది. కెప్టెన్ రాహుల్ చౌదరీ మినహా మిగతా ఆటగాళ్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. రాహుల్ చౌదరీ ఒక్కడే 12 పాయింట్లు సంపాదించాడు.

మరోవైపు జోరుమీదున్న ముంబా జట్టు ఆరంభం నుంచే నిలకడగా పాయింట్లు సాధించింది. విరామ సమయానికి ముంబా 18-10 పాయింట్లతో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. కెప్టెన్ అనూప్ కుమార్‌తోపాటు రిషాంక్, మోహిత్ చిల్లర్ రైడింగ్‌లో ఆకట్టుకున్నారు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 26-22తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది.

Advertisement
 
Advertisement
Advertisement