హైదరాబాద్‌లో పీబీఎల్‌ సెమీస్, ఫైనల్స్‌

PBL: Hyderabad To Host Semi Finals And Final - Sakshi

వేదిక బెంగళూరు నుంచి భాగ్యనగరానికి మార్పు

న్యూఢిల్లీ: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) ఐదో సీజన్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట బెంగళూరు అంచె పోటీలను (ఫిబ్రవరి 5 నుంచి 6 వరకు), అనంతరం 7, 8వ తేదీల్లో రెండు సెమీఫైనల్స్‌తో పాటు 9న జరిగే ఫైనల్‌ పోరును బెంగళూరులోని శ్రీ కంఠీరవ ఇండోర్‌ స్టేడియంలో జరిగేలా షెడ్యూల్‌ను తయారు చేశారు. అయితే ఆ సమయంలో స్టేడియం అందుబాటులో ఉండడం లేదని... దాంతో అక్కడ మ్యాచ్‌లను నిర్వహించడం కష్టం అంటూ బెంగళూరు రాప్టర్స్‌ జట్టు గురువారం ట్విట్టర్‌ వేదికగా స్పష్టం చేసింది.

దీంతో బెంగళూరు అంచె మ్యాచ్‌లతోపాటు సెమీఫైనల్స్, ఫైనల్‌ను హైదరాబాద్‌కు తరలిస్తూ పీబీఎల్‌ నిర్వాహకులు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. సెమీస్, ఫైనల్‌ మ్యాచ్‌లు ముందుగా నిర్ణయించిన తేదీల్లోనే జరుగుతాయి. ఫలితంగా పీబీఎల్‌ తాజా సీజన్‌లో హైదరాబాద్‌ ఆతిథ్యం ఇచ్చే మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. మొదట హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఉండగా... ప్రస్తుతం అది ఫిబ్రవరి 9వ తేదీ వరకు పొడిగించారు. పీబీఎల్‌ ఐదో సీజన్‌ ఈ నెల 20న చెన్నై వేదికగా ప్రారంభమవుతుంది. 24 వరకు చెన్నైలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత జనవరి 25 నుంచి 28 వరకు లక్నో అంచె పోటీలు ఉంటాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top