నార్త్‌ ఈస్టర్న్‌  వారియర్స్‌ బోణీ

North Eastern Warriors Mumbai scraped the rackets - Sakshi

ముంబై రాకెట్స్‌పై 4–1తో విజయం

ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌  

సాక్షి, హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ బోణీ చేసింది. గురువారం జరిగిన పోరులో 4–1తో ముంబై రాకెట్స్‌ను చిత్తు చేసింది. నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ సభ్యురాలైన భారత స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. మిక్స్‌డ్‌ డబుల్స్‌తో మొదలైన ఈ పోరులో నార్త్‌ ఈస్టర్న్‌ జంట లియావో మిన్‌ చన్‌–కిమ్‌ హ న 15–6, 15–13తో కిమ్‌ జి జంగ్‌–పియ జబదియా (ముంబై) జోడీపై గెలిచింది. ముంబై ట్రంప్‌గా ఎంచుకున్న పురుషుల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో సెన్‌సోమ్‌బున్‌సుక్‌ (నార్త్‌ ఈస్టర్న్‌) 15–9, 10–15, 15–11తో అంటోన్సెన్‌ను కంగుతినిపించడంతో ముంబై –1 స్కోరుకు పడిపోయింది.

తర్వాత మహిళల సింగిల్స్‌ వారియర్స్‌కు ట్రంప్‌ మ్యాచ్‌ కాగా... ఇందులో రీతుపర్ణ దాస్‌ 12–15, 15–10, 15–12తో శ్రేయాన్షి పరదేశి (ముంబై)ని ఓడించింది. దీంతో నార్త్‌ ఈస్టర్న్‌ 4–(–1)తో మరో రెండు మ్యాచ్‌లుండగానే విజయాన్ని ఖాయం చేసుకుంది. రెండో పురుషుల సింగిల్స్‌లో టియాన్‌ హౌవీ (నార్త్‌ ఈస్టర్న్‌) 6–15, 13–15తో సమీర్‌ వర్మ (ముంబై) చేతిలో పరాజయం చవిచూడగా, పురుషుల డబుల్స్‌లో లియావో మిన్‌ చన్‌–యు ఇయాన్‌ సియంగ్‌ (నార్త్‌ ఈస్టర్న్‌) ద్వయం 12–15, 15–13, 7–15తో కిమ్‌ జి జంగ్‌–లీ యంగ్‌ డే (ముంబై) చేతిలో ఓడింది. శుక్రవారం జరిగే పోటీల్లో అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌తో బెంగళూరు రాప్టర్స్, హైదరాబాద్‌ హంటర్స్‌తో అవధ్‌ వారియర్స్‌ తలపడతాయి.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top