డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి సెలక్టర్‌.. సరికొత్త వివాదం

దేవాంగ్‌ గాంధీ(ఫైల్‌ఫొటో) - Sakshi

కోల్‌కతా: జాతీయ క్రికెట్‌ జట్టు సెలక్టరైన దేవాంగ్‌ గాంధీ రంజీ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో క్రికెటర్ల డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లడంతో సరికొత్త వివాదానికి తెరలేపింది. నగరంలోని ఈడెన్‌ గార్డెన్‌లో ఆంధ్రాతో మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో బెంగాల్‌ క్రికెటర్ల డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి దేవాంగ్‌ గాంధీ వెళ్లి నిబంధనలను అతిక్రమించాడు. గురువారం రెండో రోజు ఆటలో భాగంగా దేవాంగ్‌ గాంధీ.. బెంగాల్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్లాడు. దీనిపై బెంగాల్‌ ఆటగాడైన మనోజ్‌ తివారీ దీన్ని ఖండించాడు. జాతీయ క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ కమిటీలో సభ్యుడైన దేవాంగ్‌ గాంధీ ఇలా డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటూ నిలదీశాడు. ఈ వివాదంపై ఫిర్యాదు చేయడంతో దేవాంగ్‌ గాంధీని డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి పంపించేశారు.

‘ మేము అవినీతి నిరోధక కోడ్‌ను ఫాలో కావాలి. ఒక జాతీయ సెలక్టర్‌ అయిన దేవాంగ్‌ గాంధీ ఎటువంటి అధికారిక సమాచారం లేకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి రాకూడదు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లతో పాటు జట్టుకు సంబంధించిన వారు మాత్రమే ఉండాలి. మరి దీన్ని దేవాంగ్‌ ఎందుకు అతిక్రమించాల్సి వచ్చింది’ అని ప్రశ్నించాడు. దాంతో దేవాంగ్‌ గాంధీని ఆ డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి బయటకు పంపించేశారు. తొలి రోజు ఆటలో భాగంగా ముందుగా బ్యాటింగ్‌ చేసిన బెంగాల్‌ 281/7 వద్ద ఉండగా మ్యాచ్‌కు బ్యాడ్‌లైట్‌ అంతరాయం కల్గించింది. కాగా, రెండో రోజు ఆటలో బెంగాల్‌ 289 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్‌ ఆటగాడు అభిషేక్‌ రామన్‌(112) శతకంతో మెరిశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top