
వోల్గోగ్రాడ్: తొలి మ్యాచ్లో క్రొయేషియా చేతిలో ఎదురైన ఓటమి నుంచి వెంటనే తేరుకున్న నైజీరియా జట్టు ఫుట్బాల్ ప్రపంచకప్లో తొలి విజయం నమోదు చేసింది. ఐస్లాండ్తో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లో నైజీరియా 2–0తో గెలుపొందింది. అహ్మద్ మూసా 49వ, 75వ నిమిషాల్లో రెండు గోల్స్ చేసి నైజీరియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. పటిష్టమైన అర్జెంటీనాను తొలి మ్యాచ్లో 1–1తో నిలువరించిన ఐస్లాండ్ రెండో మ్యాచ్లో నిరాశపరిచింది. ఆ జట్టుకు 83వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్ను సిగుర్డ్సన్ వృథా చేశాడు.
అతను కొట్టిన కిక్ గోల్పోస్ట్ పైనుంచి బయటకు వెళ్లింది.
నైజీరియా విజయంతో గ్రూప్ ‘డి’లో ప్రిక్వార్టర్ ఫైనల్ రెండో బెర్త్ కోసం మూడు జట్లు రేసులోకి వచ్చాయి. 6 పాయింట్లతో క్రొయేషియా ఇప్పటికే నాకౌట్ బెర్త్ దక్కించుకోగా... 3 పాయింట్లతో నైజీరియా రెండో స్థానంలో ఉంది. ఒక పాయింట్తో ఐస్లాండ్, అర్జెంటీనా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నైజీరియా ప్రిక్వార్టర్స్కు చేరాలంటే ఈనెల 26న అర్జెంటీనాతో జరిగే మ్యాచ్ను కనీసం ‘డ్రా’ చేసుకోవాలి. అర్జెంటీనా మాత్రం భారీ గోల్స్ తేడాతో కచ్చితంగా గెలవాలి. ఐస్లాండ్ ప్రిక్వార్టర్స్కు చేరాలంటే 26న క్రొయేషియాపై భారీ గోల్స్ తేడాతో నెగ్గాలి.