
లీడ్స్: ఇంగ్లండ్తో మూడో వన్డే అనంతరం ఆటగాళ్లంతా మైదానాన్ని వీడుతున్న సమయంలో చోటుచేసుకున్న ఘటన బుధవారం తీవ్ర స్థాయి ఊహాగానాలకు తావిచ్చింది. అదేంటంటే, ఆట ముగిశాక డ్రెస్సింగ్ రూమ్కు వస్తూ భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోని... అంపైర్లను అడిగి వారి నుంచి మ్యాచ్ బంతిని తీసుకున్నాడు.
సరిగ్గా ఇదే విధంగా 2014లో ఆస్ట్రేలియాతో సిరీస్లో బెయిల్స్ను తీసుకున్న ధోని తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల పరిస్థితులకు తగినట్లు ఆడటం లేదంటూ విమర్శలు ఎక్కువవుతున్న నేపథ్యంలో రెండు ఘటనల మధ్య పోలిక మొదలైంది. ధోని పరిమిత ఓవర్ల క్రికెట్కూ త్వరలో వీడ్కోలు చెబుతాడంటూ మీడి యా హల్చల్ చేసింది. అయితే, ఎటువంటి సంచలన ప్రకటన రాకపోవడంతో చివరకు ఇదంతా ఊహాగానంగానే మిగిలిపోయింది.