
మొహ్మద్ షమీ ఎదురుచూపులు
మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న భారత పేసర్ మొహ్మద్ షమీ.. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టుల్లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నాడు.
కోల్ కతా: మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న భారత పేసర్ మొహ్మద్ షమీ.. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టుల్లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నాడు. దానిలో భాగంగా ఫిట్ నెస్ నిరూపించుకునే పనిలో పడ్డాడు. ఈ మేరకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్ నెస్ పరీక్షకు షమీ హాజరయ్యాడు.
ఆసీస్ తో జరిగే చివరి రెండు టెస్టుల కోసం చేసే జట్టు ఎంపికలో తాను కూడా చోటు దక్కించుకుంటానని ఆశాభావ్యం వ్యక్తం చేస్తున్నాడు. ' ప్రస్తుతం నేను ఇంకా పూర్తిగా ఫిట్గా ఉన్నాననే విషయం నాకు తెలీదు. కాకపోతే చివరి రెండు టెస్టులు ఆడతానని అనుకుంటున్నా. నా ఫిట్ నెస్ ను నిరూపించుకుంటా' 'అని షమీ తెలిపాడు.
విజయ్ హజారే వన్డే టోర్నీలో భాగంగా నగరానికి వచ్చిన షమీ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిను కలిశాడు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆసీస్ తో చివరి రెండు టెస్టుల ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు. తొలి టెస్టులో భారత్ ఓడినప్పటికీ తిరిగి సత్తా చాటుకుని సిరీస్ గెలుస్తుందని షమీ ధీమా వ్యక్తం చేశాడు.