మా కెప్టెన్‌ నిర్ణయం సరైందే : పాక్‌ క్రికెటర్‌

Mohammad Hafeez Defends  Sarfaraz Ahmed About Toss Advice - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ నిర్ణయాన్ని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ హఫీజ్‌ సమర్థించాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో సమిష్టిగా విఫలమైనందునే ఓడిపోయామని అభిప్రాయపడ్డాడు. ఓ పాక్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో హఫీజ్‌  మాట్లాడుతూ.. ' టాస్‌ నిర్ణయం మేం జట్టుగా కలిసి తీసుకున్నది. మ్యాచ్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్‌ సరిగా చేయకపోవడం వల్లే  ఓటమి చవి చూశాం. ఈ పరాజయంలో జట్టుగా అందరి బాధ్యత ఉంది. ఒక్క సర్ఫరాజ్‌నే నిందించడం సరికాదు. మా సెమీస్‌ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. భారత్‌ మ్యాచ్‌ అనంతరం మాకు తగినంత సమయం దొరికింది. నూతనోత్సాహంతో మిగతా మ్యాచ్‌లను గెలుస్తాం’ అని  హఫీజ్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఇక పాక్‌ తమ తర్వాతి మ్యాచ్‌ను ఆదివారం దక్షిణాప్రికాతో ఆడనుంది.

పాక్‌ ప్రధాని, మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ సైతం టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ తీసుకోవాలని మ్యాచ్‌కు ముందు సర్ఫరాజ్‌కు సూచించారు. కానీ సర్ఫరాజ్‌ ఆయన మాటను లెక్క చేయకుండా ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో సర్ఫరాజ్‌ అహ్మద్‌ తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఈ నిర్ణయమే పాకిస్తాన్‌ విజయాలను దెబ్బతీసిందని, చాంపియన్స్‌ ట్రోఫి ఫైనల్లో భారత్‌ చేసిన తప్పునే ఇప్పుడు పాక్‌ చేసిందని అభిమానులు, ఆ దేశ మాజీ క్రికెటర్లు సర్ఫరాజ్‌పై మండిపడ్డారు. పాక్‌ మాజీ బౌలర్‌  షోయబ్‌ అక్తర్‌ అయితే సర్ఫరాజ్‌కు బుద్ధిలేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top