ఓటరు సహకార కేంద్రం ఏర్పాటు
మహబూబ్నగర్ రూరల్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో సందేహాలు. ఎవరిని అడగాలి.. ఫిర్యాదు చేయాలంటే ఎక్కడ సంప్రదించాలి..? ఎన్నికల వేళ ఇలాంటి ప్రశ్నలు సాధారణమే. అయితే ఓటర్ల సందేహాల నివృత్తికి కేంద్ర ఎన్నికల సంఘం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా ఓటరు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని..
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పక్కాగా అమలు చేయాల్సిందే. ఉల్లంఘనకు తావిస్తే సరైన అభ్యర్థులు ఎన్నికయ్యే అవకాశం ఉండదు. ఈ విషయంలో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలి. నిబంధనల ఉల్లంఘనపై ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదుదారులు వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఫిర్యాదును వెంటనే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి పంపి అక్రమాల కట్టడికి చర్యలు తీసుకుంటారు.
వీటిపైనే ఎక్కువగా..
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. సహాయ కేంద్రానికి ఎక్కువగా ఓటరు జాబితాకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయి. దరఖాస్తు చేసినా ఓటరు జాబితాలో పేరు లేదని కొందరు, ఈసారి పోలింగ్ కేంద్రం మారిందని ఇంకొందరు సహాయ కేంద్రానికి ఫోన్ చేస్తున్నారు. పట్టణ ప్రాంతంలో ఉన్న వారు పోలింగ్ కేంద్రాల చిరునామాకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు.
మూడు నియోజకవర్గాలు..
జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మహబూబ్నగర్లో 2,58,658 ఓటర్లు ఉండగా.. పురుషులు 1,28,268, సీ్త్రలు 1,30,377.. ఇతరులు 13 ఉన్నారు. జడ్చర్లలో 2,23,222 ఓటర్లు ఉండగా 1,11,354 పురుషులు, సీ్త్రలు 1,11863, ఇతరులు 5 ఉన్నారు. దేవరకద్రలో 2,39,077 ఓటర్లలో 1,18,372 పురుషులు, 1,20,705 సీ్త్రలు కలిపి మొత్తం 7,20,957 మంది ఓటర్లు ఉన్నారు. సద్వినియోగం చేసుకోవాలి
ఓటరు సహకార కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి. అందరి సహకారం ఉంటేనే ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. నిబంధనల ఉల్లంఘనపై ఏ సమయంలోనైనా నిర్భయంగా ఫిర్యాదు చేయాలి. ఓటరు జాబితాలో పేరు రాకపోయినా.. పోలింగ్ కేంద్రానికి సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకునేందుకు వీలుంటుంది.
– నవీన్, మహబూబ్నగర్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి 8 రకాల సేవలు..
ఓటరు హెల్ప్లైన్ ద్వారా 8 రకాల సేవలు అందిస్తున్నారు. పోలింగ్, ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ిఫిర్యాదులు, అభిప్రాయాల స్వీకరణ, ఎన్నికల అధికారికి సంబంధించిన వివరాలు, శాసనసభ నియోజకవర్గ సమాచారాన్ని ఓటర్లకు తెలియజేయడం, ఓటరు నమోదు, పోలింగ్ కేంద్రం చిరునామా, ఎన్నికల సమాచారం, 24 గంటలు ఓటర్లకు సాయం అందించడం వంటి సేవలు ఇందులో ఉన్నాయి.
సందేహాలుంటే 08542–241311 నంబర్ సంప్రదించొచ్చు
తహసీల్దార్ కార్యాలయంలో
24 గంటల అందుబాటులో సిబ్బంది