ఐపీఎల్‌ ప్లేయర్లు మ్యాచ్‌కు ఆరున్నర కోట్లు సంపాదిస్తారు  | IPL players earn six and a half crore rupees | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ ప్లేయర్లు మ్యాచ్‌కు ఆరున్నర కోట్లు సంపాదిస్తారు 

Apr 20 2018 1:36 AM | Updated on Apr 20 2018 1:36 AM

IPL players earn six and a half crore rupees - Sakshi

లండన్‌: భవిష్యత్తులో ఐపీఎల్‌ ఆడే ఆటగాళ్లు మ్యాచ్‌కు రూ. 6.5 కోట్లు (మిలియన్‌ డాలర్లు) సంపాదిస్తారని ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీ చెప్పుకొచ్చారు. దశాబ్దం క్రితం మోదీ నేతృత్వంలో రూపొందిన ఈ లీగ్‌ అచిర కాలంలోనే విశ్వవ్యాప్తమైంది. ఇంటా బయటా ఇప్పుడున్న ఎన్నో లీగ్‌లకు ఐపీఎలే ప్రేరణ. ఐపీఎల్‌కు పదేళ్లు పూర్తయిన సందర్భంగా లలిత్‌ మోదీ స్థానిక దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఐపీఎల్‌ ఇప్పుడు ఉన్నత శిఖరంలో ఉంది. ప్రపంచంలోనే మేటి క్రికెట్‌ లీగ్‌గా ఎదిగింది. ఎంతో మంది ప్రేక్షకుల్ని, స్పాన్సర్లను ఆకట్టుకుంది. ఫ్రాంచైజీ యాజమాన్యాలు బాగా ఆర్జిస్తున్నాయి. భారత్‌లోని క్రికెట్‌ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకుంటున్నాయి.

ఇప్పుడు స్టోక్స్‌ సీజన్‌కు రూ. 12 కోట్లు (1.95 మిలియన్స్‌) సంపాదిస్తున్నాడు. త్వరలో రూ. 72 కోట్లు (12 మిలియన్స్‌) సంపాదిస్తాడు. క్రికెటర్లు ఇంగ్లీష్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఫుట్‌బాలర్ల ఆదాయాన్ని అందుకోగలరు. ఇది ఇప్పుడు కాకపోయిన సమీప భవిష్యత్తులో సాధ్యమవుతుంది’ అని అన్నారు. లీగ్‌ల ప్రాచుర్యంతో సంప్రదాయ క్రికెట్‌కు గడ్డుకాలం తప్పదన్నారు. పెద్ద పెద్ద సిరీస్‌లే మూడు, నాలుగేళ్లకోసారి జరిగే పరిస్థితి వస్తుందని, ఐసీసీ ప్రాభవం కోల్పోతుందని చెప్పారు. టెస్టు చాంపియన్‌షిప్‌ నిర్వహిస్తేనే ఐదు రోజుల ఆట బతుకుతుందని విశ్లేషించారు.  

Advertisement
 
Advertisement
Advertisement