ఐర్లాండ్‌పై భారత మహిళల గెలుపు | Indian ladies defeat Ireland 3-1 in first hockey Test | Sakshi
Sakshi News home page

ఐర్లాండ్‌పై భారత మహిళల గెలుపు

Apr 17 2014 2:03 AM | Updated on Sep 2 2017 6:07 AM

ఐర్లాండ్‌తో హాకీ టెస్టు సిరీస్‌లో భారత మహిళలు శుభారంభం చేశారు. చాంపియన్స్ చాలెంజ్-1 ట్రోఫీకి సన్నాహకంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 3-1 తేడాతో ఐర్లాండ్‌పై నెగ్గింది.

బెల్జియం చేతిలో పురుషుల జట్టు ఓటమి
న్యూఢిల్లీ: ఐర్లాండ్‌తో హాకీ టెస్టు సిరీస్‌లో భారత మహిళలు శుభారంభం చేశారు. చాంపియన్స్ చాలెంజ్-1 ట్రోఫీకి సన్నాహకంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 3-1 తేడాతో ఐర్లాండ్‌పై నెగ్గింది. మెగాన్ ఫ్రేజర్ 4వ నిమిషంలోనే నమోదు చేసిన గోల్‌తో తొలి అర్ధభాగంలో 1-0 ఆధిక్యం సాధించిన ఐర్లాండ్.. ఆ ఒక్క గోల్‌తోనే సరిపెట్టుకుంది. రెండో అర్ధభాగంలో పూనమ్ రాణి (37వ నిమిషం), రీతూ రాణి (61వ) సునితా లక్రా (68వ)లు వరుస గోల్స్ సాధించి భారత్‌కు విజయాన్నందించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ గురువారం జరగనుంది.
 
 పోరాడి ఓడిన పురుషుల జట్టు..
 ప్రపంచకప్‌కు సన్నాహకంగా యూరప్‌లో పర్యటిస్తున్న పురుషుల జట్టుకు బెల్జియం చేతిలో ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 1-2 తేడాతో పోరాడి ఓడింది. 17వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను టామ్ బూన్ గోల్‌గా మలచడంతో ఖాతా తెరిచిన బెల్జియంను ఆ తరువాత భారత ఆటగాళ్లు సమర్థవంతంగా నిలువరించారు. 58వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్‌పాల్ సింగ్ గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. అయితే మరుసటి నిమిషం (59వ)లోనే బూన్ మరో గోల్ నమోదు చేసి బెల్జియంకు ఆధిక్యాన్నందించాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను గురువారం నెదర్లాండ్స్‌తో ఆడనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement