భారత్‌ ఘన విజయం..! | india win by six wickets in first one day match | Sakshi
Sakshi News home page

భారత్‌ ఘన విజయం..!

Feb 2 2018 12:22 AM | Updated on Feb 2 2018 7:51 AM

india win by six wickets in first one day match - Sakshi

కోహ్లి,రహనే

డర్బన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలివన్డేలో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో విజయ దుంధుంబి మోగించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌  ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 270 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లిసేన ఆరంభంలోనే  ఓపనర్లు రోహిత్‌ శర్మ(20), ధావన్‌(35) వికెట్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లి రహానేతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కోహ్లి తన కెరీర్‌లో 33వ సెంచరీని 106 బంతుల్లో పూర్తి చేశాడు. సెంచరీతో కదంతొక్కిన సారథి విరాట్‌ కోహ్లికి మ్యాచ్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ వరించింది. 

రహానే కూడా నెమ్మదిగా బౌండరీలు కొడుతూ క్రీజులో పుంజుకున్నాడు. రహానే(79) వ్యక్తిగత పరుగుల వద్ద  ఫెలూక్వాయో వేసిన 43 ఓవర్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత అల్‌రౌండర్‌ హార్దిక్‌​పాండ్యా కోహ్లితో జత కట్టాడు. విరాట్‌ తన అద్భుతమైన ఆట తీరుతో అందర్నీ అకట్టుకున్నాడు. కోహ్లి 112(119) వ్యక్తిగత పరుగుల వద్ద ఫెలూక్వాయో వేసిన 45 ఓవర్‌లోనే మూడో బంతికి రబడాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని విన్నింగ్‌ షాట్‌ ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 45.3 ఓవర్లలో విజయలక్ష్యాన్ని ఛేదించింది. దక్షిణాఫ్రికాలో బౌలర్లలో  ఫెలూక్వాయోకు రెండు వికెట్లు, మోర్నీ మోర్కెల్‌కు ఒక వికెట్‌ దక్కాయి.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకుంది. దాంతో ఇన్నింగ్స్‌ను డీకాక్‌, హషీమ్‌ ఆమ్లాలు ఆరంభించగా సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ ఆమ్లా(16) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరి నిరాశపరిచాడు. బూమ్రా బౌలింగ్‌లో ఆమ్లా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆపై సఫారీ ఇన్నింగ్స్‌ను డీకాక్‌-డు ప్లెసిస్‌లు ముందుకు తీసుకెళ్లారు. అయితే జట్టు స్కోరు 83 పరుగుల వద్ద డీకాక్‌(34) రెండో వికెట్‌గా అవుయ్యాడు.

అటు తరువాత మర్‌క్రామ్‌(9), డుమినీ(12), మిల్లర్‌(7)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో దక్షిణాఫ్రికా 134 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో క్రిస్‌ మోరిస్‌-డు ప్లెసిస్‌ జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జంట 74 పరుగులు జోడించడంతో సఫారీలు రెండొందల మార్కును చేరారు. మోరిస్‌(37) ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కాగా, టెయిలెండర్ ఫెలూక్వాయో(27) సాయంతో డు ప్లెసిస్‌ సమయోచిత ఇన్నింగ్‌ ఆడి సెంచరీ చేశాడు.  దాంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. భారత్‌ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించగా, చాహల్‌ రెండు వికెట్లు తీశాడు. ఇక బూమ్రా, భువనేశ్వర్‌లకు తలో వికెట్‌ దక్కింది.


 

Advertisement
 
Advertisement
Advertisement