దీపావళి రోజు పాక్‌కు భారత్‌ షాక్‌

దీపావళి రోజు పాక్‌కు భారత్‌ షాక్‌

క్వాంటన్ (మలేసియా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో భారత్ 3-2 స్కోరుతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించింది. దీపావళి రోజున భారత హాకీ ఆటగాళ్లు ట్రోఫీ సాధించి భారతీయులకు కానుకగా అందించారు. 


 


ఈ మ్యాచ్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. భారత ఆటగాడు రూపిందర్‌ పాల్‌ సింగ్‌ తొలి గోల్‌ సాధించి జట్టుకు శుభారంభం అందించాడు.  23వ నిమిషంలో భారత ఆటగాడు అఫాన్‌ యూసుఫ్‌ మరో గోల్‌ చేయడంతో ఆధిక్యం 2-0కి పెరిగింది. కాగా ఆ తర్వాత పాక్‌ వరుసగా రెండు గోల్స్‌ చేయడంతో ఇరు జట్ల స్కోర్లు 2-2తో సమమయ్యాయి. ఈ దశలో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. మ్యాచ్‌ మరికొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా, నికిన్‌ తిమ్మయ్య గోల్‌ చేయడంతో భారత్‌ మళ్లీ 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పాక్‌ ఆటగాళ్లు గోల్‌ చేయలేకపోయారు. భారత్‌ మ్యాచ్‌తో పాటు ట్రోఫీని సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా భారత్‌ ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీని గెలవడమిది రెండోసారి. భారత హాకీ జట్టుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top