దీపావళి రోజు పాక్కు భారత్ షాక్
క్వాంటన్ (మలేసియా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో భారత్ 3-2 స్కోరుతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై విజయం సాధించింది. దీపావళి రోజున భారత హాకీ ఆటగాళ్లు ట్రోఫీ సాధించి భారతీయులకు కానుకగా అందించారు.
ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. భారత ఆటగాడు రూపిందర్ పాల్ సింగ్ తొలి గోల్ సాధించి జట్టుకు శుభారంభం అందించాడు. 23వ నిమిషంలో భారత ఆటగాడు అఫాన్ యూసుఫ్ మరో గోల్ చేయడంతో ఆధిక్యం 2-0కి పెరిగింది. కాగా ఆ తర్వాత పాక్ వరుసగా రెండు గోల్స్ చేయడంతో ఇరు జట్ల స్కోర్లు 2-2తో సమమయ్యాయి. ఈ దశలో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా, నికిన్ తిమ్మయ్య గోల్ చేయడంతో భారత్ మళ్లీ 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పాక్ ఆటగాళ్లు గోల్ చేయలేకపోయారు. భారత్ మ్యాచ్తో పాటు ట్రోఫీని సొంతం చేసుకుంది. ఓవరాల్గా భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీని గెలవడమిది రెండోసారి. భారత హాకీ జట్టుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.