ఊపిరి పీల్చుకున్న సఫారీలు | India Returned South Africa Players Corona Virus Negative | Sakshi
Sakshi News home page

ఊపిరి పీల్చుకున్న సఫారీలు

Apr 3 2020 6:57 PM | Updated on Apr 3 2020 7:00 PM

India Returned South Africa Players Corona Virus Negative - Sakshi

భారత పర్యటనకు దక్షిణాఫ్రికా క్రికెటర్లు వచ్చినప్పటి ఫోటో

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా తమ క్రికెటర్లకు కరోనా వైరస్‌ సోకిందేమోనన్న భయంతో వణికిపోతున్న దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. మార్చి నెలలో భారత​ పర్యటనకు వచ్చిన సఫారీ క్రికెట్‌ జట్టు.. ఆ ద్వైపాక్షిక సిరీస్‌ను రద్దు చేయడంతో స్వదేశానికి వెళ్లకతప్పలేదు. దీనికి కారణం కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడమే. అయితే భారత పర్యటన తర్వాత 14 రోజులు క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న ఈ క్రికెట‌ర్ల‌కు క‌రోనా వైర‌స్ సోక‌లేద‌ని ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వర్గాలు తాజాగా వెల్లడించాయి.  విదేశాల నుంచి వ‌చ్చిన నేప‌థ్యంలో క్రికెటర్లు అందరినీ క్వారంటైన్‌లో ఉంచింది. రోజువారీగా వారిని ప‌ర్య‌వేక్షించిన బోర్డు మెడికల్ టీమ్‌.. తాజాగా క్రికెట‌ర్ల ఆరోగ్య ప‌రిస్థితిని వెల్లడించింది. అంద‌రూ క్రికెట‌ర్లు ఆరోగ్యంగా ఉన్నార‌ని, క్వారంటైన్ స‌మ‌యంలో క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలేవి బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని పేర్కొంది. ఇక క‌రోనా నిర్దారిత ప‌రీక్ష చేసుకున్న వారంద‌రికీ నెగిటివ్ అని తేలింద‌ని తెలిపింది.(కరోనా టెస్టింగ్‌ సెంటర్‌గా క్రికెట్‌​ స్టేడియం..!)

సఫారీలు తమ భారత పర్యటనలో మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అయితే తొలి వన్డే వర్షం వల్ల రద్దు కాగా, రెండో వన్డేకు సిద్ధం అయ్యే లోపే కరోనా వైరస్‌ ప్రభావంతో సిరీస్‌ను ఉన్నపళంగా రద్దు చేశారు. కాగా, రెండో వన్డే సందర్భంగా లక్నోలో ఒక హెటల్‌ దిగడం, ఆ హోటల్లోనే కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలిన బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌ కూడా బస చేయడం సఫారీ క్రికెటర్లలో భయం పట్టుకుంది.  ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత్‌ నుంచి వచ్చిన తమ దేశ క్రికెటర్లను సెల్ఫ్‌ ఐసోలేషన్‌(స్వీయ నిర్బంధం)లో ఉండమని ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఆదేశించింది. ఇప్పుడు వారికి కరోనా సోకలేదని తేలడంతో టెన్షన్‌ కాస్తా పోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement